కర్ణాటకలో మొదలైన పుష్ప 2 సెగలు

నిన్న జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రొడ్యూసర్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్స్ ప్రెస్ మీట్ ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీస్తోంది. ముఖ్యంగా కర్ణాటకలో అప్పుడే సెగలు మొదలయ్యాయి. ఆ రాష్ట్రం హక్కులు తీసుకున్న పంపిణీదారుడు కెజిఎఫ్, కాంతార రికార్డులు బద్దలయ్యే స్థాయిలో రిలీజ్ ఇస్తామని, ఎక్కువ షోలు వేసుకుని మరిచిపోలేని మైలురాళ్ళు సాధిస్తామని చెప్పడం కొన్ని వర్గాలకు రుచించడం లేదు. శాండల్ వుడ్ గర్వంగా ఎప్పటికీ చెప్పుకునే రెండు బ్లాక్ బస్టర్లను ఉదాహరించి వాటిని దాటుతామని పబ్లిక్ గా హామీ ఇవ్వడం పట్ల యష్ తదితర హీరోల అభిమానులు నిరసన గళం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటినుంచో కర్ణాటకలో తెలుగు సినిమాల ఆధిపత్యం మీద అక్కడి నిర్మాతలు కొందరు గుర్రుగా ఉన్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, సలార్ టైంలో వాటికి ఎక్కువ స్క్రీన్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారంటూ మీడియాకు సైతం ఎక్కారు. ఇవి కొంత మేర ప్రభావం చూపించాయి. చాలా దశాబ్దాలుగా కన్నడలో డబ్బింగులు నిషేధించింది ఇతర బాషా చిత్రాలను కట్టడి చేయడం కోసమే. స్వర్గీయ డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నంత కాలం కఠినంగా అమలు చేశారు. కొన్నేళ్ల క్రితమే దాన్నే ఎత్తివేశారు కానీ కన్నడ అనువాదాల కన్నా ఇప్పటికీ తెలుగు, తమిళం ఒరిజినల్ వెర్షన్లే ఎక్కువ ఆడుతున్న విషయాన్ని గమనించాలి.

పుష్ప 2కి జడిసి కర్ణాటకలో డిసెంబర్ 5కి ఇప్పటిదాకా పెద్ద కన్నడ సినిమాలేవీ షెడ్యూల్ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు అనౌన్స్ చేస్తే మాత్రం థియేటర్ పంపకాల పంచాయితీ ఖచ్చితంగా వస్తుంది. కన్నడ భాష వాడకం గురించి, అక్కడి సంఘాలు కొన్ని బయటి నుంచి వలస నుంచి వచ్చిన వాళ్ళను వేధించడం గురించి కానీ సామజిక మాధ్యమాల్లో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2 ది రూల్ కి కనివిని ఎరుగని రిలీజ్ ఇస్తే ఇది మరో రచ్చకు దారి తీయడం ఖాయంగా కనిపిస్తోంది. వీటి సంగతి ఎలా ఉన్నా ఈ సినిమాకు కేరళను మించి ఓపెనింగ్స్ తెచ్చుకునే ఇతర రాష్ట్రంగా కర్ణాటకనే నిలుస్తోంది.