వీరమల్లుని కవ్విస్తున్న OG

ఒకే స్టార్ హీరో రెండు సినిమాలు ఒకేసారి నిర్మాణంలో ఉన్నప్పుడు వాటి తాలూకు అప్డేట్స్ ఎవరు ఇవ్వాలనేది రిలీజ్ డేట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది రెగ్యులర్ గా చిత్రాలు చేసేవాళ్లకు వరిస్తుంది. కానీ పవన్ కళ్యాణ్ కేసు వేరు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక పెండింగ్ ఉన్న సినిమాలను పూర్తి చేసే విషయంలో సమ న్యాయం చేయాలనే ఉద్దేశంతో సమానంగా డేట్లు ఇచ్చారనే సంగతి తెలిసిందే. మొదటి ప్రాధాన్యత హరిహర వీరమల్లుకి ఉంది. మార్చి 28 విడుదల తేదీ అధికారికంగా ప్రకటించారు కాబట్టి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం న్యాయం, సముచితం.

అలాని ఓజి టీమ్ మౌనంగా లేదు. క్రమం తప్పకుండా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటూ ఇప్పటికే పీక్స్ లో ఉన్న అంచనాలను ఎప్పటికప్పుడు పెంచే పనిలో బిజీగా ఉంది. నిన్న హఠాత్తుగా డివివి సంస్థ ఎక్స్ హ్యాండిల్ ని కొత్త హెడర్ తో అప్డేట్ చేయడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోయారు.

దీంతో వీరమల్లు బృందం రంగంలోకి దిగి తమ వైపు నుంచి ఒక కంటెంట్ వదిలేలా చూసుకుంది. ఏది బాగుంది ఏది బాలేదనేది పక్కన పెడితే ఒకదాని మీదే అటెన్షన్ ఉండేలా ప్రమోషన్ చేస్తే బాగుంటుందనేది అధిక శాతం ఫ్యాన్స్ అభిప్రాయం. నిజానికి వీరమల్లు పెట్టిన బడ్జెట్ కి తగ్గ హైప్ బయట లేదు.

ఓజి ఎప్పుడు పూర్తయినా రిలీజ్ డేట్ మాత్రం హరిహర వీరమల్లు తర్వాత కనీసం నాలుగైదు నెలలు గ్యాప్ వచ్చేలా ఉంటుంది. ఎక్కడ చూసినా ఓజి జ్వరం ప్రేక్షకుల్లో మాములుగా లేదు. అందులో నటించినవాళ్లు వేరే సినిమాల ఇంటర్వ్యూలకు వచ్చినప్పుడు సైతం ఈ ప్రస్తావన తేకుండా యాంకర్లు ఉండలేకపోతున్నారు.

ఇదంతా చూస్తుంటే పవన్ వర్సెస్ పవన్ అనిపిస్తోంది కదూ. బ్యాలన్స్ షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిన వీరమల్లు ఫస్ట్ కాపీని డిసెంబర్ కల్లా సిద్ధం చేయాలని నిర్మాత ఏఎం రత్నం పట్టుదలతో ఉన్నారు. రెండు భాగాలు కాబట్టి సీక్వెల్ ఎంత శాతం చిత్రీకరణ చేశారనేది ఇంకా తెలియాల్సి ఉంది.