రూల్ చేస్తున్న ‘పుష్ప 2’ బిజినెస్

ఇంకో యాభై రోజుల కంటే తక్కువ వ్యవధిలో విడుదల కాబోతున్న పుష్ప 2 ది రూల్ బిజినెస్ ఒప్పందాలు హాట్ కేకుల్లా జరిగిపోతున్నాయి. ఎన్నడూ లేనిది థియేటర్ యజమానులతో చేసుకున్న అగ్రిమెంట్ల తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి ఫీవర్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

హైప్ దృష్ట్యా మైత్రి మూవీ మేకర్స్ ఆశించిన దానికన్నా ఎక్కువ మొత్తమే డిస్ట్రిబ్యూటర్లు ఆఫర్ చేసినట్టుగా ట్రేడ్ టాక్. అధికారికంగా ఇలాంటి లెక్కలు బయటికి రావు కానీ పంపిణి వర్గాల్లో తిరుగుతున్న నెంబర్లు చూస్తుంటే ఆర్ఆర్ఆర్, కల్కిలనే టార్గెట్ చేసేలా ఉన్నాయి.

అనఫీషియల్ సోర్స్ ప్రకారం పుష్ప 2కి ఏపీ, తెలంగాణ కలిపి సుమారు 215 కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. నైజామ్ ప్రాంతంలో మైత్రి స్వంతంగా వంద కోట్ల బ్రేక్ ఈవెన్ పెట్టుకుని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, సీడెడ్ 30 కోట్లకు అభిషేక్, వైజాగ్ 23.5 కోట్లకు సాయి కొర్రపాటి, ఈస్ట్ 14.5 కోట్లకు మైత్రి, వెస్ట్ 10.8 కోట్లకు ఎల్విఆర్, కృష్ణ 12.5 కోట్లకు బన్నీ వాస్, గుంటూరు 15.5 కోట్లకు యువి వంశీ, నెల్లూరు 7.5 కోట్లకు భాస్కర్ హక్కులు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇది ఖరారుగా చెప్పలేం కానీ కొంచెం అటుఇటుగా ఈ మొత్తాలకే అగ్రిమెంట్లు జరిగాయని వినిపిస్తోంది. హైప్ అలా ఉంది మరి.

ఈ అంకెల సంగతి పక్కనపెడితే పుష్ప 2 మానియా ఇంకా ప్రమోషన్లు మొదలు కాకుండానే పీక్స్ లో ఉన్న సంగతి అర్థమైపోతుంది. సుకుమార్ ప్రస్తుతం బ్యాలన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న కారణంగా ఇంకా పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టలేదు. ఐటెం సాంగ్ చిత్రీకరణ కాగానే కంటెంట్ బయటికి వదలబోతున్నారు.

నార్త్ ఇండియాలోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న కారణంగా ప్రత్యేకంగా బాలీవుడ్ వెర్షన్ మీద దృష్టి పెట్టబోతున్నారు. డిసెంబర్ 6 రిలీజ్ డేట్ అయినప్పటికీ ఒక రోజు ముందు ప్రీమియర్లు వేసే అవకాశాన్ని నిర్మాతలు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. దాదాపు ఖరారవుతాయి.