ఆలస్యాల పర్వంలో అక్కినేని హీరోలు

అదేంటో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హీరోలకు వివిధ రకాల అయోమయాలు ఒకే టైంలో తలెత్తడం కాకతాళీయమే అయినా వాటి వెనుక ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. అవేంటో చూద్దాం.

ముందుగా నాగ చైతన్య విషయానికి వస్తే తండేల్ విడుదల తేదీ ఇప్పటి దాకా అధికారికంగా ప్రకటించలేకపోతున్నారు. గేమ్ ఛేంజర్ వాయిదా పడింది కాబట్టి క్రిస్మస్ కు వస్తుందని అభిమానులు భావించారు. డిసెంబర్ ఎలాగూ నాగ్ హిట్ సెంటిమెంట్, సో ఆ యాంగిల్ లోనూ ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే అప్పటికంతా ఫస్ట్ కాపీ, సెన్సార్ అవ్వకపోవచ్చనే వార్త రావడంతో ఉసురుమన్నారు.

సరే సంక్రాంతికి వస్తుందిలెమ్మని అభిమానులు ట్విట్టర్ లో ట్రెండింగ్ మొదలుపెట్టారు. అయినా సరే టీమ్ నుంచి నో రెస్పాన్స్. నిజం చెప్పాలంటే బన్నీ వాస్, అల్లు అరవింద్ ఏం చేయాలనే దాని మీద ఇంకా చర్చిస్తూనే ఉన్నారు. ఈ రెండు ఆప్షన్లు కుదరకపోతే జనవరి చివరి వారం రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాల్సిందే.

ఇక అఖిల్ సంగతి చూస్తే యువి క్రియేషన్స్ నిర్మించే ప్యాన్ ఇండియా మూవీ కోసం మేకోవర్ చేసుకుని సిద్ధంగా ఉంటే ఇప్పుడు అది కాదని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రొడక్షన్లో మురళీకిషోర్ దర్శకత్వంలో ఓకే చేసుకున్న ఇంకో పీరియాడిక్ డ్రామా ముందు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారట.

షూటింగ్ ప్రారంభోత్సవం జరిగే దాకా అఖిల్ ఆరో సినిమా ఏదవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫైనల్ గా నాగార్జున సంగతి చూస్తే కుబేర ఎప్పుడు రిలీజ్ చేయాలనేది శేఖర్ కమ్ముల ఇంకా డిసైడ్ చేయలేదు. కలిసొచ్చిన సెంటిమెంట్ సంక్రాంతి ఏమైనా ఛాన్స్ ఉంటుందేమోనని నాగ్ భావించారు కానీ అది సాధ్యం కాలేదు.

ఇప్పుడు శివరాత్రిని టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. తండేల్ కు దీని మీద చెప్పుకోదగ్గ గ్యాప్ ఉండాలనేది నాగ్ ఉద్దేశం. రజనీకాంత్ తో నటిస్తున్న కూలికి ఇంకా చాలా టైం ఉంది కనక దాని టాపిక్ అక్కర్లేదు. మొత్తానికి ఇలా నాన్న, ఇద్దరు వారసులకు సమస్య రావడం విచిత్రమే.