రానా పట్టుబడితే రీమేక్ అవ్వాల్సిందే

ఏదైనా భాషలో హిట్టయిన సినిమాను వీలైనంత త్వరగా రీమేక్ చేసుకుంటేనే సేఫ్. లేదంటే సబ్ టైటిల్స్ పెట్టుకుని ఆడియన్స్ ఓటిటిలో చూసేస్తే ఉన్న థ్రిల్ కాస్తా తగ్గిపోతుంది. గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ లాంటి స్టార్ హీరోల చిత్రాలు అందుకే ఆశించినంత పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాయి.

2021లో కోలీవుడ్ నుంచి మానాడు వచ్చింది. పెద్ద సక్సెస్. రేసులో వెనుకబడ్డ శింబుకి కొత్త లైఫ్ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టిస్టుగా ఎస్జె సూర్య పెద్ద స్థాయికి వెళ్లేందుకు దోహదపడింది. ఓటిటిలో తెలుగు డబ్బింగ్ తో పాటు అందుబాటులోకి వచ్చాక మన ఆడియన్స్ భారీ సంఖ్యలో చూశారు. అంత పెద్ద రీచ్ ఉంది దీనికి.

మానాడు రీమేక్ హక్కులు సురేష్ సంస్థ ఎప్పుడో కొనుగోలు చేసింది. కానీ హీరో దర్శకుడు దొరక్క వాయిదా పెడుతూ వచ్చారు. సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా రెండు మూడు పేర్లు వినిపించాయి కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు.

ఒకదశలో రవితేజ దగ్గరకు కూడా వెళ్లిందన్నారు కానీ అదంతా పుకారు స్టేజి దగ్గరే ఆగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడీ మానాడుని ముందు హిందీలో తీసే ప్లానింగ్ లో ఉన్నాడు రానా. ఆకాశవాణితో దర్శకుడిగా రుజువు చేసుకున్న అశ్విన్ గంగరాజుతో తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. హీరో ఎవరనేది ఇంకా తేలలేదు కానీ క్యాస్టింగ్ పనులు మొదలుపెట్టలేదట.

మరి తెలుగులో తీస్తారా లేదానేది అనుమానంగానే ఉంది. టైం లూప్ కాన్సెప్ట్ ఆధారంగా ఒక సామాన్యుడికి, పోలీస్ ఆఫీసర్ కు మధ్య జరిగే పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ థ్రిల్లర్ కి దర్శకుడు వెంకట్ ప్రభు. ఫామ్ కోల్పోయిన ఆయనకు నాగచైతన్య, విజయ్ లు ఆఫర్లు ఇచ్చేలా చేసింది మానాడునే.

ఇంత ట్రాక్ రికార్డు ఉన్న బ్లాక్ బస్టర్ త్వరగా రీమేక్ అయ్యుంటే బాగుండేది. సౌత్ లో ఆడిన సినిమాలన్నీ హిందీ రీమేక్ లో ఆడతాయనే గ్యారెంటీ లేదు. జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్, అల వైకుంఠపురములో లాంటివి దారుణంగా పోయాయి. అందుకే రానా నార్త్ ఆడియన్స్ కు తగ్గట్టు కీలక మార్పులు చేయించాడట.