కీరవాణికి రెండు మెగా పరీక్షలు

ఆర్ఆర్ఆర్ ద్వారా ఆస్కార్ అందుకుని అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతినార్జించిన ఎంఎం కీరవాణి అవకాశాలు ఎన్ని వస్తున్నా ఎంపికలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ట్రిపులార్ తర్వాత సంగీతం అందించిన వాటిలో అధిక శాతం సంతృప్తినివ్వలేకపోయినా నా సామిరంగ లాంటి డీసెంట్ హిట్లు మరగతమణి (తమిళ పేరు) ని రేసులో ఉంచాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ఎస్ఎస్ఎంబి 29 మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా మొదలుకాలేదు కానీ వచ్చే 2025 మాత్రం ఆయనకు రెండు పెద్ద మెగా పరీక్షలు పెట్టబోతోంది. అది కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో.

ఇప్పటిదాకా కీరవాణి తన కెరీర్ లో పవన్ కళ్యాణ్ కి సంగీతం అందించలేదు. మొదటిసారి హరిహర వీరమల్లు రూపంలో అవకాశం తలుపు తట్టింది. దాని గ్రాండియర్ కు తగ్గట్టు బీజీఎమ్ కావాలని క్రిష్, ఏఎం రత్నం కోరిమరీ ఆయనను తీసుకున్నారు. మార్చి 28 విడుదల తేదీ ప్రకటించారు కాబట్టి డిసెంబర్ నుంచి రీ రికార్డింగ్ పనులు మొదలుపెట్టొచ్చు.

షూటింగ్ వచ్చే నెల పూర్తి కానుంది. డిప్యూటీ సిఎం అయ్యాక పవన్ నటించిన మొదటి సినిమా కావడంతో అంచనాలు మాములుగా లేవు. పాటల పరంగానూ ఆడియోకు భారీ క్రేజ్ ఉంటుంది. ఈ రెండూ అందుకుంటే పవర్ స్టార్ కాంబోకి న్యాయం జరుగుతోంది.

ఇక రెండో ఎగ్జామ్ చిరంజీవి విశ్వంభర. తొలుత అనుకున్న జనవరి విడుదలని రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మే 9 డేట్ వినిపిస్తోంది కానీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మెగాస్టార్ తో పని చేయడం కీరవాణికి కొత్త కాదు. వీళ్ళ కలయికలో ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు లాంటి ఎక్స్ ట్రాడినరి మూవీస్ వచ్చాయి. ఎవర్ గ్రీన్ పాటలు నిలిచిపోయాయి. ఎస్పి పరశురామ్ మాత్రమే నిరాశపరిచింది. తిరిగి మూడు దశాబ్దాల తర్వాత విశ్వంభరతో కలుసుకున్నారు. మరి మెగా బ్రదర్స్ ఇద్దరికీ ఒకేసారి  ఒకే సంవత్సరంలో ఎలాంటి సంగీతం ఇవ్వబోతున్నారో వేచి చూడాలి.