ఉక్కిరిబిక్కిరి కానున్న ప్రభాస్ అభిమానులు

వచ్చే వారం రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆన్ లైన్, ఆఫ్ లైన్ సందడి చాలా జోరుగా ఉండబోతోంది. కొత్త సినిమాల హడావిడితో పాటు రీ రిలీజుల వర్షం కురిపించేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధమవ్వడంతో పర్సులకు పని చెప్పక తప్పేలా లేదు.

ముందుగా 19, 20 తేదీల్లో ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ని హైదరాబాద్ లో స్పెషల్ షోలు వేయబోతున్నారు. ఉదయం ఆటలు బుక్ మై షోలో పెట్టగానే వేగంగా రెడ్ మార్కు వైపు వెళ్లిపోవడం గమనార్హం. థియేటర్ రిలీజై ఇంకా ఏడాది తిరక్కుండా వస్తున్నా కూడా ఈ స్థాయి స్పందన రావడం చూస్తే డార్లింగ్ ఫ్యాన్స్ మామూలోళ్లు కాదని చెప్పాలి.

22న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ని దిల్ రాజు పునఃవిడుదల చేస్తున్నారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. రీ మాస్టర్ చేసిన ప్రింట్ ని మరోసారి అనుభూతి చెందడానికి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇక అసలైన బర్త్ డే నాడు ప్రభాస్ డెబ్యూ మూవీ ‘ఈశ్వర్’ రీ రిలీజ్ రూపంలో మరోసారి పలకరించనుంది.

ఇప్పుడు డై హార్డ్ ఫ్యాన్స్ గా ఉన్న చాలా మంది యూత్ ఈ సినిమా అసలు టైంలో వెండితెరపై చూసి ఉండరు. సో వాళ్ళకో సెలబ్రేషన్ లా మిగిలిపోతుంది. ఇవి చాలవన్నట్టు ఇప్పటికే మూడు నాలుగు సార్లు రీ రిలీజ్ చేసిన ‘రెబెల్’ సైతం 23న మళ్ళీ వస్తోంది.

వీటికి పక్కనపెడితే ‘ది రాజా సాబ్’ ప్రపంచాన్ని ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఇవ్వబోతున్నట్టు ఇటీవలే ఎస్కెఎన్ చెప్పిన సంగతి తెలిసిందే. సలార్ పార్ట్ 2, కల్కి 2 బి బృందాల నుంచి కేవలం విషెస్ మాత్రమే ఉండొచ్చని టాక్.

హను రాఘవపూడితో చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ సిద్ధం చేసే పనులు జరుగుతున్నాయని తెలిసింది. చూస్తుంటే అక్టోబర్ 19 నుంచి 23 దాకా ఫ్యాన్స్ కి వీటితోనే సరిపోయేలా ఉంది. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించిన ప్రభాస్ హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్న నేపథ్యంలో ఈ మాత్రం స్పెషల్ గా జరుపుకోవడంలో ఆశ్చర్యం ఏముంది.