అంచనాలకు మించి అఖండ 2 తాండవం

బ్లాక్ బస్టర్ కాంబినేషన్ నాలుగోసారి చేతులు కలిపింది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కలయికలో రూపొందనున్న అఖండ 2 ఇవాళ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. టీమ్ తో పాటు బాలయ్య ఇద్దరు కూతుళ్లు హాజరవ్వగా వాళ్ళ చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. కరోనా మెల్లగా తగ్గుతున్న సమయంతో థియేటర్లలో సరైన సినిమాలు పడక జనం రాని పరిస్థితుల్లో రిలీజైన అఖండ టైటిల్ కు తగ్గట్టే అఖండ విజయం సాధించి రికార్డుల బూజు దులిపి అద్భుత విజయం సాధించింది.

దీనికి సీక్వెల్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ తో పాటు సగటు ప్రేక్షకులు కూడా కోరుకున్నారు. వాళ్ళ ఆకాంక్ష ఫలించింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండ 2లో పలు ఆసక్తికరమైన విశేషాలున్నాయి. మొదటి భాగం లాగే పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ ని కొనసాగిస్తూనే ఈసారి కొత్తగా డివోషనల్ టచ్ ని కమర్షియల్ గా చూపించబోతున్నట్టు తెలిసింది. అఖండలో ఇంటర్వెల్ తర్వాతే ఈ అంశాలు ఉంటాయి. కానీ అఖండ 2 తాండవంలో పేర్లు పడటం దగ్గరి నుంచే అఘోరాగా బాలయ్య మాస్ ని చూడొచ్చని అంటున్నారు. సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడికి సంబంధించిన కొన్ని కీలక ఎపిసోడ్లు ఉంటాయని తెలిసింది.

సింహ, లెజెండ్, అఖండ తర్వాత రిపీటవుతున్న కలయిక కావడంతో ప్రకటన దశ నుంచే దీని మీద విపరీతమైన క్రేజ్ నెలకొంది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ భారీ బడ్జెట్ కేటాయించబోతోంది. క్యాస్టింగ్ దాదాపు అదే కొనసాగనుంది. కొత్తగా తోడయ్యే వాళ్ళను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈసారి తమన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. సరికొత్త సౌండింగ్ ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అఖండని నిలబెట్టిన ఈ సంగీత సంచలనం ఈసారి అంతకు మించి ఇస్తాడనే నమ్మకంతో మ్యూజిక్ లవర్స్ లో ఉంది. ఎన్బికె 109 సంక్రాంతికి విడుదల కానుండగా అఖండ 2 తాండవం కూడా వచ్చే ఏడాదే రిలీజయ్యే అవకాశాలున్నాయి.