బాబు నెక్ట్స్ టార్గెట్ ఏంటి? టీడీపీలో చ‌ర్చ‌

రాష్ట్రంలో టీడీపీని గాడిలోకి పెట్టేందుకు.. తిరిగి పుంజుకునేలా చేసేందుకు పార్టీ అధినేత చంద్ర‌బాబు వేసిన అడుగులు ప్ర‌శంస‌నీయంగా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీకి పార్ల‌మెంట‌రీ జిల్లాల కమిటీల‌ను ఏర్పాటు చేయ‌డంతోపాటు.. ఇంచార్జ్‌ల‌ను నియ‌మించ‌డం కూడా మంచి ప‌రిణామ‌మేన‌ని అది కూడా ఎన్నిక‌లు ముగిసిన ఏడాదిన్న‌ర స‌మ‌యంలోనే చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యంపై సీనియ‌ర్లు కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, ఇదొక్క‌టే స‌రిపోద‌ని.. పార్టీని క్షేత్ర‌స్థాయిలో ప‌రిపుష్టం చేసేందుకు మ‌రింత‌గా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు త‌దుప‌రి వ్యూహంపై టీడీపీ నేత‌లు చ‌ర్చిస్తున్నారు. ప్ర‌స్తుతం పార్ల‌మెంట‌రీ జిల్లాల ప్ర‌క్షాళ‌న పూర్తిచేసిన చంద్ర‌బాబు.. ఇక‌, అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగుతార‌ని అంటున్నారు. రాష్ట్రంలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో కేవ‌లం 23 నియోజ‌క‌వ‌ర్గాల్లోనే గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం సాధించింది. మిగిలిన 152 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఏంటి? ఇక్క‌డ పార్టీ దూసుకుపోయేందుకు ఏంచేయాల‌నే అంశాల‌పై చంద్ర‌బాబు ఇప్పుడు దృష్టిసారించేందుకు అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నిజానికి ప‌శ్చిమ‌గోదావ‌రి, తూర్పుగోదావ‌రి, క‌ర్నూలు వంటి జిల్లాల్లో పార్టీకి బ‌ల‌మైన నాయ‌కులు, ఓటు బ్యాంకు కూడా ఉంది.

అయితే, గ‌త ఏడాది జ‌గ‌న్ సునామీతో ప‌లు జిల్లాలు తుడిచి పెట్టుకుపోయాయి. నెల్లూరు, క‌డ‌ప‌, క‌ర్నూలు వంటి జిల్లాల్లో పూర్తిగా పార్టీ చ‌తికిల ప‌డింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ఆయా జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల‌ను పూర్తిస్థాయిలో గాడిలో పెట్టేందుకు చంద్ర‌బాబు త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని త‌మ్ముళ్లు చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలావుంటే, గ‌తంలో వైసీపీ నుంచి వ‌చ్చి పార్టీలో చేరిన వారిలో కేవలం అమ‌ర్‌నాథ్‌రెడ్డి వంటి ఒక‌రిద్ద‌రు త‌ప్ప‌.. మిగిలిన వారంతా కూడా మౌనంగా ఉంటున్నారు.

అస‌లు వారు.. టీడీపీలో ఉన్నారా? లేరా? అనే సందేహాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇలాంటి వారి ప‌రిస్థితిని కూడా స‌మీక్షించి.. చంద్ర‌బాబు కాయ‌క‌ల్ప చికిత్స‌కు తెర‌దీసే స‌మ‌యం వ‌చ్చింద‌ని అంటున్నారు. ఏదేమైనా.. ఇదే మంచి త‌రుణం .. అన్న‌ట్టుగా నియోజ‌క‌వ‌ర్గాల‌పై చంద్ర‌బాబు వ్యూహం అమ‌లు చేస్తే.. పార్టీకి జ‌వ‌సత్వాలు రావ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.