కమలంతో తెలంగాణ కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతుందా ?

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అత్యధిక స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు బీజేపీ అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నది. ఇక ఇటీవలే తెలంగాణలో అధికారం దక్కించుకున్న రేవంత్ రెడ్డి సీఎం పీఠం నిలబెట్టుకోవాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడం తప్పనిసరి.

రేవంత్ రెడ్డిని బీజేపీ ఏజెంట్ అని, త్వరలోనే ఆ పార్టీలో చేరడం ఖాయం అని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ ద్వారా కేంద్ర హోంమంత్రి  అమిత్ షాకు చెందిన ఒక ఫేక్ వీడియో సర్క్యులేట్ అవుతుందన్న ప్రచారం జాతీయ స్థాయిలో కలకలం రేపుతున్నది.

దేశంలో ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగియగా మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ‘’మూడోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నీ తొలగిస్తాం’’ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నట్లుగా ఒక వీడియో వైరల్‌ అవుతోంది. తెలంగాణలో ఇటీవల అమిత్ షా పర్యటించాడు. సిద్దిపేటలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచారసభలో అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపణలు వస్తున్నాయి.

ఈ ఫేక్‌ వీడియోపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు రాగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ రంగంలోకి దిగింది. ఈ ఫేక్‌ వీడియోను అప్‌లోడ్‌ చేసిన వారి కోసం వివరాల కోసం ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్‌ ఫ్యూజన్‌ అండ్ స్ట్రాటజిక్‌ ఆపరేషన్ ద్వారా అధికారులు విచారణ చేపట్టారు.

తెలంగాణ కాంగ్రెస్ విభాగం ఈ ఫేక్‌ వీడియోను ప్రచారం చేస్తున్నట్లు బీజేపీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్‌ అమిత్‌ మాలవీయ ఆరోపించారు. ముస్లింలకు ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్‌ను తొలగించడంపైనే అమిత్‌ షా మాట్లాడారనీ, కానీ రిజర్వేషన్లు అన్నింటినీ తొలగిస్తామని చెప్పలేదని అయన అన్నారు. ఫేక్ వీడియోను సర్క్యులేట్‌ చేసినవారు న్యాయపరమైన పరిణామాలకు సిద్దం కావాలని హెచ్చరించారు.

తెలంగాణలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చారు. ఇతర వర్గాలకు తోడు అత్యధిక శాతం మైనారిటీలు ఆదరించడంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే స్థానాలను దక్కించుకోగలిగింది. నాలుగు నెలలలో మారిన పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు ఆశాజనకంగా ఉన్నట్లు కనిపించడం లేదు.

అందుకే ముఖ్యమంత్రి రేవంత్ గత కొన్ని రోజులు రిజర్వేషన్ల అంశాన్ని, ప్రధానంగా ముస్లిం రిజర్వేషన్లను ముందుకు తెస్తున్నాడు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఐటీ సెల్ నుండి ఫేక్ వీడియో సర్క్యులేట్ అయిందన్న వార్తను బట్టి కాంగ్రెస్ కయ్యానికి కాలుదువ్వుతుందా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం మూడు రాష్ట్రాలలోనే.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తే మొదట కర్ణాటక తర్వాత తెలంగాణ ప్రభుత్వాలను పడగొడుతుంది అన్న ప్రచారం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ ఫేక్ వీడియో వ్యవహారం ఎక్కడికి వెళ్తుందో వేచిచూడాలి.