టిల్లు లిల్లీకి అవకాశాల వెల్లువ

మొన్నటిదాకా తెలుగు సినిమాల్లో కనిపించడమే తగ్గించేసిన అనుపమ పరమేశ్వరన్ కు టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎక్కడ లేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బోల్డ్ సీన్స్ విషయంలో అభిమానులు తొలుత సంశయం వ్యక్తం చేసినా తర్వాత తను తీసుకున్నది ఎంత సరైన నిర్ణయమో ఫలితం ఋజువు చేసింది. నటనకు లోటు లేకపోయినప్పటికీ గ్లామర్ షోకు నో చెబుతూ వచ్చిన అనుపమ ఇప్పుడు టిల్లు తరహాలో డిఫరెంట్ షేడ్స్ ఉంటే ఎస్ చెప్పేస్తోంది కాబట్టి దర్శక నిర్మాతలు తనను కలుస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఆక్టోపస్ లో తనదే ముఖ్య పాత్రనే సంగతి తెలిసిందే. ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు.

సినిమా బండితో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రవీణ్ దర్శకత్వంలో రూపొందుతున్న పరదాలో అనుపమదే లీడ్ రోల్. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి రేపింది. తాజాగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన కొత్త ప్రాజెక్టు ఓకే అయ్యిందని సమాచారం. కార్తికేయ చావు కబురు చల్లగాతో డెబ్యూ చేసిన కౌశిక పెగళ్ళపాటి తీస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ లో అనుపమ పరమేశ్వరన్ నే తీసుకున్నట్టు తెలిసింది. కిష్కిందపురి టైటిల్ పరిశీలనలో ఉంది. క్రియేటివ్ కాన్సెప్ట్స్ రాసుకుంటున్న దర్శకులకు అనుపమ మంచి ఛాయస్ అవుతోంది. అందుకే ఏరికోరి మరీ ఆఫర్లు ఇస్తున్నారు.

ఇవి కాకుండా మలయాళంలో చేస్తున్న జెఎస్కెని ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. టిల్లు స్క్వేర్ కు ముందు అనుపమ చేసిన ఈగల్ తీవ్రంగా నిరాశపరచగా తమిళంలో జయం రవి సరసన నటించిన సైరెన్ లో కేవలం క్యామియో కావడంతో ఎక్కువ పేరు కీర్తి సురేష్ కు వెళ్ళింది. ఇప్పుడు ఒక్క సక్సెస్ దారి మార్చేసింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉన్న టైంలో అనుపమ లాంటి సీనియర్లు మళ్ళీ పుంజుకోవడం మంచిదే. సాయిశ్రీనివాస్ తో తను గతంలో రాక్షసుడు చేసింది కానీ అందులో ఎక్కువ స్కోప్ దొరకలేదు. ఈసారి అలాంటి టెన్షన్ ఏమీ ఉండదు.