పార్టీల‌కు స‌వాల్ రువ్వుతున్న స‌త్తెన‌ప‌ల్లి..

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌కు స‌వాల్‌గా మారింది. కొన్ని రోజుల కింద‌ట‌ జనసేన నుంచి వచ్చిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలో చేరారు.  దీంతో సత్తెనపల్లిలో వైసిపి మరింత పుంజుకుంటుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే మరోవైపు వైసీపీలోనే సత్తెనపల్లిలో ఉన్న లోకల్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తుమ్ములాటలు తరచుగా తర‌మీద‌కు వస్తున్నాయి. అంబటి రాంబాబు తమను పట్టించుకోవడంలేదని కనీసం తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఇటీవలే కొందరు నాయకులు చెబుతున్నారు.

అంతే కాదు సత్తెనపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడంలేదని కేవలం తన‌ను పొగుడుతున్న వారికి మాత్రమే అవకాశం ఇస్తున్నారని తనకు బ్రహ్మరథం పట్టిన వారికి తనకు పూలు ప‌రిచి నడిపించిన వారికి మాత్రమే పార్టీలో పదవులు కల్పిస్తున్నా రని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు సొంత పార్టీ నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎర్రం వెంకటేశ్వర రెడ్డిని పార్టీలోకి తీసుకోవడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే అసలు ఉన్నటువంటి అసంతృప్తులను తగ్గించేటటువంటి అంశం మీద అంబటి రాంబాబు దృష్టి పెట్టకపోవడం అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలో టిడిపి జోరు పెద్దగా కనిపించడం లేదు. కానీ ఎన్నికల సమయానికి మాజీ స్పీకర్ కోడెల‌ శివప్రసాదరావు సానుభూతి గనక పని చేసినట్లయితే సత్తెనపల్లిలో వైసీపీకి ఎదురుగాలులు వీయడం ఖాయ‌మ‌ని అంటున్నారు. ఇక‌, ఎర్రం వెంకటేశ్వర రెడ్డి కాంగ్రెస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు.

తర్వాత 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఆయన కేవలం 9000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగారు. ఎర్రం వెంకటేశ్వర్ రెడ్డికి వ్యక్తిగతంగా ఇక్కడ పెద్దగా ఇమేజ్ లేదు. కాంగ్రెస్ జెండాపై ఆయన గెలిచారు తర్వాత జనసేన‌ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఆయన దూకుడు ప్రదర్శించలేకపోయారు. దీంతో ఎర్రం వెంకటేశ్వర రెడ్డి వైసీపీలోకి వచ్చినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా.. స‌త్తెన ప‌ల్లి నియోక‌వ‌ర్గంలో వైసీపీ, జ‌న‌సేన‌, టీడీపీలకు స‌వాల్‌గా మారింద‌నేది ఖాయంగా క‌నిపిస్తోంది.