మహేష్ 29కి సీక్వెల్ ఆలోచనలు

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్ గా టాలీవుడ్ సినిమా ప్రేమికులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న Mahesh Babu రాజమౌళి కలయిక అతి త్వరలోనే కార్యరూపం దాల్చనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రచయిత విజయేంద్ర ప్రసాద్ నేతృత్వంలో దీని స్క్రిప్ట్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో ఇండియానా జోన్స్ తరహాలో కనివిని ఎరుగని స్థాయిలో జక్కన్న దీన్నో విజువల్ వండర్ గా చూపించబోతున్నట్టు ఆల్రెడీ టాక్ ఉంది. ఆర్ఆర్ఆర్ ఇంటర్వెల్ లో కొన్ని జంతువులకే ఊగిపోయిన జనం మూవీ మొత్తం అవే ఉంటే ఏమైపోతారో వేరే చెప్పాలా?

తాజాగా Rajamouli విజయేంద్రప్రసాద్ లు ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో ఈ చిత్రాన్ని భాగాలుగా రూపొందించే ఆలోచనలో ఉన్నామని చెప్పడం ఒక వైపు ఆనందాన్ని మరోవైపు టెన్షన్ ని కలిగిస్తున్నాయి. ఎందుకంటే బాహుబలితో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ దాని కోసం ఐదేళ్లకు పైగానే త్యాగం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మహేష్ కూడా ఇదే తరహాలో కమిటయితే ఆల్రెడీ రెండేళ్లకో రిలీజ్ వస్తున్న సంబరం కాస్తా మూడు నాలుగు సంవత్సరాలకు మారిపోతుంది. ఎంత జక్కన్న సినిమా అయినప్పటికీ మరీ అంత గ్యాప్ తో తమ హీరోని తెరమీద చూసుకోకుండా ఉండటం ఫ్యాన్స్ కి కష్టం కదా!

ఇదంతా ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న మహేష్ కు ఎంతలేదన్నా వచ్చే ఆగస్ట్ దాకా దానికే సమయం సరిపోతుంది. ఆలోగా రాజమౌళి ఫుల్ స్క్రిప్ట్ తో సిద్ధంగా ఉంటాడా అంటే చెప్పలేం. ఎందుకంటే ఆస్కార్ వేడుక జరిగే దాకా ఇంకా RRR కోసమే ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ మధ్య మధ్య ఇండియా వచ్చి వెళ్తున్న జక్కన్న మహేష్ 29 మీద ఇంకా పూర్తి స్థాయి దృష్టి పెట్టలేదు. ఒకవేళ ఏదైనా ఆలస్యం జరిగిన పక్షంలో నెంబర్ మారి ఈ కాంబో కాస్తా మహేష్ 30గా మారిపోతుంది అంతే.