విశాఖ భూముల కుంభ‌కోణం.. వైఎస్ పాత్రే కీల‌కం: సిట్

విశాఖ భూకుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూశాయి. సాక్షాత్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కార్యాలయం జోక్యంతోనే కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన విషయం బయటికొచ్చింది. అవసరమైన నిరభ్యంతర పత్రాలు జారీ చేయించడంలో సీఎంవో పాత్ర ఎంతో కీలకమని… ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చిచెప్పింది.

ప్రభుత్వ భూములు అమ్ముకునేందుకు వీలు కల్పించే ఫైళ్లపై సిఫార్సు చేస్తూ నాటి రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంతకాలు చేయడం, ఆ తర్వాత ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయంతో ఎన్‌వోసీల జారీ చకచకా సాగిపోయింది. నిరంతరం జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన ఆదేశాలు ఇస్తూ, అనుమతులు ఇప్పించడంపై సీఎంవో ప్రత్యేక శ్రద్ధ చూపింది. అవ‌న్నీ నకిలీ పట్టాలని పేర్కొంటూ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు నివేదికలు పంపినా తోసిపుచ్చార‌ని సిట్ పేర్కొంది.

ఉన్నతస్థాయి వ్య‌క్తుల ప్రమేయంతోనే ఆ భూములకు నిరభ్యంతర పత్రాలు ఇచ్చేశారు. 2006లో పదెకరాల వ్యవసాయ భూమి కేటాయించి… 2008లో అమ్ముకునేందుకు ఎన్వోసీ ఇచ్చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చున‌ని సిట్ పేర్కొంది. డీఫాం పట్టా లేకపోయినా, నకళ్లతో దరఖాస్తు చేసి తిరస్కరణకు గురైన లబ్ధిదారులు… సీఎంవోలో దరఖాస్తులివ్వగానే జిల్లా యంత్రాంగానికి ఆదేశాలొచ్చి.. ఉరుకులు పరుగులమీద ఎన్వోసీలు జారీ చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయంతోనే జ‌రిగిన‌ట్టు సిట్ నివేదిక పేర్కొంది.