కేసీఆర్ పోస్టులకు ఉలిక్కిపడుతున్న కాంగ్రెస్ !

లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ విషయం పెరిగి పెద్దదై సర్కారు మెడకు చుట్టుకుంటుదోనన్న ఆందోళన కాంగ్రెస్ సర్కారులో కనిపిస్తున్నది. సరిగ్గా మూడు రోజుల క్రితం సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో ఖాతా తెరిచిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోస్టులు సర్కారుకు ఊపిరి సలపనివ్వడం లేదు.  మహబూబ్ నగర్ పర్యటనలో ఉన్న కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి.

నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయింది’ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం అధికారులను పంపి ఆ ఏరియాలో కరంటు సరఫరా అయ్యే సబ్ స్టేషన్లతో పాటు. చుట్టుపక్కల ఇళ్ల యజమానులను కలిసి మరీ స్టేట్ మెంట్లు తీసుకుని కరంటు కోతలు లేవని, కేసీఆర్ అబద్దాలు చెప్పాడని ప్రకటించారు.

ఇక కరంటు కోతలు, నీటికొరత మూలంగా హాస్టల్స్ కు సెలవులు ఇస్తున్నామని, విద్యార్థులు నెల రోజుల పాటు ఇళ్లకు వెళ్లిపోవాలని చీఫ్ వార్డెన్ ఇచ్చిన నోటీసుపై విద్యార్థులు నిరసనకు దిగారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ‘రాష్ట్రంలో కరంటు, సాగునీరు, తాగునీరు కొరతపై సీఎం డిప్యూటీ సీఎం నాలుగు నెలలుగా చేస్తున్న వ్యాఖ్యలు తప్పు అని ఉస్మానియా వార్డెన్ ఇచ్చిన నోటీసును బట్టి తెలుస్తుంది’ అని పోస్ట్ చేశారు.

దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం
క్యాంపస్ లోని సబ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక 11kv ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ ల ద్వారా స్పష్టమైందని,  వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసినందుకు చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేసినట్లు చెబుతున్నారు. స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యార్థులు ఎక్కడకు వెళ్లక్కర్లేదని అసలు రాష్ట్రంలో కరెంటు కోతల్లేవని ప్రకటించారు. అడపాదడపా అక్కడక్కడా సమస్యలు తలెత్తడం సహజం. దానిని ప్రజలు కూడా పట్టించుకోరు. పొరపాట్లు జరిగితే సరిదిద్దుకోవాలని భావిస్తారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఅర్ సోషల్ మీడియా పోస్టులకు ఎందుకు ఉలిక్కిపడుతుందో మరి.