రంగస్థలం కాంబో ఫిక్సయినట్లే

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తర్వాతి సినిమా విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగిపోయినట్లే. శంకర్ సినిమా తర్వాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో జట్టు కట్టాల్సిన రామ్ చరణ్.. ఆ సినిమాను క్యాన్సిల్ చేసిన విషయం అధికారికంగా తేలిపోయింది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మారిన తన ఇమేజ్‌కు గౌతమ్ కథ సూటవ్వదన్న కారణంతో చరణ్ ీ సినిమాను పక్కన పెట్టినట్లు రెండు నెలల కిందటే వార్తలొచ్చాయి. ఐతే దీనిపై చిత్ర వర్గాల నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

కాగా రామ్ చరణ్ మీడియా వ్యవహారాలు చూసే శివ చెర్రీ.. గౌతమ్‌తో చరణ్ సినిమా ప్రస్తుతానికి క్యాన్సిల్ అయిందని, భవిష్యత్తులో ఈ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందని ఆశిద్దామని పేర్కొంటూ ట్విట్టర్లో పోస్టు పెట్టాడు. అలాగే ఈ స్థానంలో చరణ్ చేసే సినిమా వేరే లెవెల్లో ఉంటుందని అతను సంకేతాలు ఇచ్చాడు. కాకపోతే చరణ్ ఎవరితో జట్టు కడతాడన్నది చెప్పలేదు.

ఐతే ఏ రకంగా చూసినా చరణ్ తర్వాతి సినిమా సుకుమార్‌తో ఉండే అవకాశాలే ఎక్కువ. చరణ్ కొంత కాలం నుంచి వేరే కథలు వింటున్నప్పటికీ దేనికీ ఓకే చెప్పలేదు. కన్నడ దర్శకుడు నర్తన్‌తో అనుకున్న సినిమా విషయంలోనూ ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు.

మరో వైపు సుకుమార్.. ‘రంగస్థలం’ తర్వాత చరణ్‌తో మరో సినిమా చేయాలని ఆసక్తితో ఉన్నాడు. ఇందుకోసం ఆయన ఒక లైన్ కూడా అనుకున్నాడు. దీని గురించి స్వయంగా రాజమౌళే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడడం విశేషం. కాకపోతే ‘పుష్ప’ సినిమాలో పూర్తిగా మునిగిపోయిన సుకుమార్.. దాన్నుంచి ఎప్పుడు బయటికి వస్తాడన్నదే తెలియడం లేదు.

కానీ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు చరణ్‌తోనే సినిమా చేయాలని అనుకుంటున్నట్లు సుకుమార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చరణ్ కూడా ఇప్పుడు తన ఇమేజ్‌ను మ్యాచ్ చేస్తూనే, కొంచెం కొత్తదనం ఉన్న సినిమా చేయగలిగేది సుకుమారే అని బలంగా నమ్ముతున్నాడు. బహుశా వీరి కలయికలో వచ్చే ఏడాది లాస్ట్ క్వార్టర్లో సినిమా మొదలు కావచ్చని భావిస్తున్నారు.