దర్శకుడు మళ్ళీ గాయబ్

ఈ నెల 16న విడుదల కాబోతున్న శాకినీ డాకిని కోసం ప్రమోషన్లు గట్టిగా జరుగుతున్నాయి. అడవి శేష్, అనుదీప్ తదితరులను అతిథులుగా తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. ఈ సందర్భంగానే ట్రైలర్ లాంచ్ జరిగిపోయింది. అయితే దర్శకుడు సుధీర్ వర్మ దీనికి కూడా రాకపోవడం ఇప్పటికే ఉన్న ప్రచారాన్ని మరింత బలోపేతం చేసింది. టీమ్ తో ఏవో మనస్పర్థలు వచ్చాయని, తనకు చెప్పకుండా కొన్ని మార్పులు చేయించి వేరే డైరెక్టర్ ఆ భాగం తీయించారని అందుకే కినుక వహించి దూరంగా ఉన్నాడని ఫిలిం నగర్ టాక్ పబ్లిక్ గానే ఉంది.

దానికి తగ్గట్టే నిన్న వేడుకలో సుధీర్ వర్మ ఎక్కడా కనిపించలేదు. టీమ్ ఏదో సమర్ధించుకునే ప్రయత్నం చేసినా ఆయన మరీ అందుబాటులో లేనంత దూరం అయితే లేడుగా. పైగా తన ట్విట్టర్ లో యాక్టివ్ గానే ఉన్న సుధీర్ జస్ట్ నాలుగు రోజుల క్రితం విడుదలైన ఒకే ఒక జీవితం గురించి పొగుడుతూ ట్వీట్లు పెట్టాడు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో తన డైరెక్షన్ లో వస్తున్న మూవీ గురించి గురించి కనీసం ఓ చిన్న మాట కూడా లేదు. థియేట్రికల్ ట్రైలర్ ని సైతం షేర్ చేసుకోలేదంటే వ్యవహారం పెద్దదిగానే కనిపిస్తోంది. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.

సుధీర్ వర్మ ప్రస్తుతం రవితేజతో రావణాసుర చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు డెబ్యూ మూవీ స్వామిరారా తర్వాత ఆ స్థాయి సక్సెస్ దక్కలేదు. చైతు దోచెయ్ ఫ్లాప్ కాగా కేశవ జస్ట్ పాస్ మార్కులతో గట్టెక్కింది. శర్వానంద్ తో చేసిన రణరంగం ఎంత డిజాస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయనక్కర్లేదు. అందుకే మాస్ మహారాజా కోసం చాలా కష్టపడుతున్నాడు. ఒకవేళ శాకినీ డాకినిలో తన కాంట్రిబ్యూషన్ వంద శాతం ఉంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడి ఉండేవాడు. కానీ ఇప్పుడంతా గప్ చుప్ అయిపోయింది. ఫలితం తేలాక మరింత క్లారిటీ వస్తుంది చూద్దాం.