అలా చేసుంటే.. 40 స్థానాల్లో గెలిచేవాళ్లం: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కులం, మ‌తం చూసుకుని తాము గ‌త ఎన్నిక‌ల్లో టికెట్లు ఇచ్చి ఉంటే.. 40కిపైగా స్థానాల్లో విజ‌యం సాధించి ఉండేవార‌మ‌ని అన్నారు. అంతేకాదు.. వైసీపీ నాయ‌కులు.. ఢిల్లీ ఎప్పుడు వెళ్లనా.. ఏం చేస్తారో.. త‌న‌కు తెలుసున‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. 75వ‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమం స్ఫూర్తితో జనసేన పార్టీని స్థాపించిన‌ట్టు చెప్పారు.

ఎవరినైనా కలపడం కష్టం.. విడదీయడం సులభమన్నారు. కుల, మత ప్రస్తావన లేని రాజకీయాలు దేశానికి కావాలన్నారు. ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం కావాలి.. దాన్ని విస్మరిస్తే విచ్చిన్నమేనన్నారు. వైజాగ్‌లో పరిశ్రమల కాలుష్యం కానీ.. ఆక్వా వల్ల నీరు, భూమి కాలుష్యం ఆయిపోయింది.. వీటిని కాపాడటమే జనసేన బాధ్యతని తెలిపారు. ఒక మసీదు, ఒక చర్చికి అపవిత్రం జరిగితే మనం బలంగా ఏ విధంగా ఖండిస్తామో.. దేవాలయాలకు అలాంటి పరిస్థితి వస్తే అంతే బలంగా ఖండిస్తామని.. అదే సెక్యులరిజమన్నారు.

కేవలం ఓట్లు కోసం మత రాజకీయాలు చేయడం సరైంది కాదన్నారు. దేశానికి వెన్నెముక భారతీయ సంస్కృతి.. ఓట్లు వస్తయో లేదో తెలియదు కానీ వాస్తవాలు మాత్రమే తాను మాట్లాడతానన్నారు. మతాల ప్రస్తావనలేని రాజకీయం జనసేన లక్ష్యమని, రామతీర్థం ఘటనలో ఖండిచాం తప్ప.. రెచ్చ గొట్టలేదని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం మత ప్రస్తావన తీసుకొచ్చే వారిని, తప్పులు చేసే వారిని జన సైనికులు, నేతలు ముక్త కంఠంతో ఖండించాలని సూచించారు.

జనసేన పార్టీని మరొక పార్టీకి కుదవ పెడుతుందని సీఎం జగన్ మాట్లాడారని పవన్ అన్నారు. తాను సోషలిస్ట్ భావాలతో పెరిగిన వాడినని, కులాల గురించి తనకు అప్పట్లో తెలిసేది కాదన్నారు. ఒక కులాన్ని వర్గ శత్రువుగా భావించడం సరికాదని చెప్పానని, కులాలను ఆపాదించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కులం చూసుకుని రాజకీయం చేసి ఉంటే జనసేనకు 40 సీట్లు వచ్చి ఉండేవన్నారు. వైసీపీ నేతలు వాళ్ల భావాలను తమపై రుద్దడం సరికాదన్నారు. జనసేన అధికారంలోకి వస్తే వ్యవస్థల్ని బలోపేతం చేస్తుందన్నారు.

వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి ఏం చేస్తారో తనకు బాగా తెలుసునని పవన్‌ కల్యాణ్ అన్నారు. మభ్యపెట్టే రాజకీయాలపై ప్రజల్లో మార్పు రాకపోతే ఏం చేయలేమన్నారు. చొక్కా పట్టుకుని అడిగే విధానం ప్రజల్లో రావాలన్నారు. ప్రజలకు అధికారులు జవాబుదారీ కావాలి.. వైసీపీ నేతలకు కాదన్నారు. ఇప్పుడు కేసులు పెడితే భవిష్యత్‌లో మీపైకూడా కేసులుంటాయన్నారు. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెప్తారని పవన్‌ అన్నారు.