పార్లమెంట్ బరి నుండి ప్రియాంక ఔట్ !

రాయ్ బరేలీ నుండి ప్రియాంక, అమేథి నుండి రాహుల్ పార్లమెంట్ ఎన్నికల బరిలోకి దిగుతారని కాంగ్రెస్ అభిమానులు ఆశిస్తున్న నేపథ్యంలో వారికి అశనిపాతం లాంటి వార్త ఎదురైంది. ఈ ఎన్నికల్లో పోటీకి దిగొద్దని ప్రియాంకాగాంధీ భావిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అమేథి నుండి పోటీ చేసిన రాహుల్ గాంధీ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో 55,120 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశాడు. 2004 నుండి సోనియాగాంధీ రాయ్ బరేలీ నుండి గెలుస్తూ వస్తున్నారు.

ఇటీవల రాజస్థాన్ నుండి సోనియాగాంధీ రాజ్యసభకు వెళ్లిన నేపథ్యంలో ఈసారి గాంధీ కుటుంబం నుండి ప్రియాంక పోటీ చేస్తుందని భావించారు. ఈ మేరకు ప్రియాంక రాయ్ బరేలి, రాబర్ట్ వాద్రా అమేథి నుండి పోటీ చేయాలని పోస్టర్లు కూడా వెలిశాయి. అయితే వాయనాడ్ లో ఎన్నికలు ముగియడంతో రాహుల్ అమేథి నుండి, ప్రియాంక రాయ్ బరేలి నుండి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి.

ప్రియాంకకు మాత్రం అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదని, ఆమె కేవలం ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు వారసత్వ విమర్శల నుండి తప్పించుకునేందుకు పోటీకి దూరంగా ఉండడమే బావుంటుందని భావిస్తున్నట్లు సమాచారం. రెండు దశాబ్దాలుగా సోనియా ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నుండి కాంగ్రెస్ తరపున ఎవరు బరిలోకి దిగుతారు అన్నది ఆసక్తిగా మారింది.