విలీన మండ‌లాల‌పై..చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో పోల‌వ‌రం విలీన మండ‌లాల‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో వైసీపీ స‌ర్కారుపై విలీన మండ‌లాల ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం లేద‌ని.. అందుకే వారు తెలంగాణ‌లో క‌లిసిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. 14 రోజులుగా కరెంట్, నీరు లేక వరద బాధిత ప్రజలు నరకం చూస్తున్నారని చంద్రబాబు నాయుడు విమ‌ర్శ‌లు గుప్పించారు.

రాష్ట్రంలో గోదావరి వరదలతో రెండు వారాలుగా ప్రజలు నరకం చూస్తున్నారని అన్న బాబు.. విలీన మండలాల్లో 14 రోజులుగా విద్యుత్ సరఫరా లేక ఆయా గ్రామాల ప్రజలు పడుతున్న బాధలు అత్యంత దారుణమ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరెంట్ రాకపోవడంతో తాగడానికి, ఇళ్లు శుభ్రపరుచుకోవడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితుల్లో వారున్నారని తెలిపారు.

వరద బురదను, కూలిన చెట్లను తొలగించి రోడ్ల పై రాకపోకలు పునరుద్ధరించడం కోసం ప్రభుత్వం నుంచి కనీస ప్రయత్నం కూడా జరగడం లేదన్నారు. వారం క్రితమే వరదలు తగ్గాయి అని ప్రకటనలు చేసిన మంత్రులు…మరి ఇప్పటికీ విద్యుత్ సరఫరాను, రాకపోకలను ఎందుకు పునరుద్దరించలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్ సర్కారు నుంచి వరద బాధితులకు కనీస సాయం అందకపోవడం వల్లనే ఎటపాక మండలం ప్రజలు తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. తమను పొరుగు రాష్ట్రంలో కలపమని ప్రజలు అడుగుతున్నారంటే ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారన్నమాటేన‌ని అన్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని చంద్ర‌బాబు కోరారు.

ప్రతిపక్ష ప్రశ్నలపై ఎదురుదాడి చెయ్యడం మాని ప్రజల వద్దకు వెళితే వాస్తవాలు తెలుస్తాయని సూచించారు. వరదకు చనిపోయిన పశువుల కళేబరాలతో, ఇళ్లలో విష సర్పాలతో, దోమలు, పురుగులతో నిద్రాహారాలు లేకుండా గడుపుతున్న బాధిత ప్రజల వేదన తెలుసుకోండని సూచించారు. ప్ర‌భుత్వ పెద్దలు గాల్లో పర్యటనలు, గాలి మాటలు పక్కన పెట్టి యుద్దప్రాతిపధికన వరద ప్రాంతాల సమస్యలు పరిష్కరించాలని చంద్ర‌బాబు వ‌రుస ట్వీట్లు చేశారు.