ఇసుక పాలసీ చండాలం – వైసీపీ ఎమ్మెల్యే

MLA YSRCP

ఇసుక ఆంధ్రప్రదేశ్ లో బంగారమైపోతోంది. ఆన్ లైన్లో ఎవరికి వారే బుక్ చేసుకునే సులువైన పద్ధతి అయితే ప్రభుత్వం తెచ్చింది. అదే టెక్నాలజీ వాడుకుని ఇసుకను పక్కదారి పట్టిస్తుండటంతో ప్రజలు ఇసుక దొరక్క తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలుగుదేశం ఆరోపణ కాదు. స్వయంగా ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చెప్పిన పచ్చి నిజం ఇది.

ఈరోజు జరిగిన జెడ్పీ సమావేశంలో వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఇసుకపై సుదీర్ఘంగా మాట్లాడారు. అయ్యా మీరు అన్నీ చెప్పమని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాం. రీచ్‌లో ఎత్తిన ఇసుక యార్డు దాకా రాకుండా మధ్యలోనే మాయమైపోతుంది.

అది ఎక్కడకు పోతుందో ఎవరికీ తెలియదు. గ్రామంలో మా కార్యకర్తలే మాకు ఇసుక ఇప్పించమని అడిగితే బొచ్చెడు ఇసుక ఇప్పించలేని పరిస్థితిలో ఉన్నాం. బొచ్చెడు కాదు దోసెడు కూడా ఇవ్వలేం. యార్డుకు రాకుండా ఇసుక ఎక్కడకు పోతుంది? అని ఆయన ప్రశ్నించారు.

కలెక్టరుకు, మైనింగ్ వారికి అనేక మార్లు దీనిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మనం చెప్పే దానికి చేసే దానికి చాలా తేడా ఉంది. మనం ఎన్ని స్కీములిచ్చినా ఈ ఇసుక విధానానికి వచ్చేటప్పటికి చాలా బాధపడుతున్నారు.

నాడు నేడు కార్యక్రమంలో కూడా తట్టెడు ఇసుక ఇచ్చిన సందర్భం లేదు. అమరావతికి లారీలో ఎత్తిన ఇసుక వినుకొండకు అని చెబితే… అది వినుకొండకు ఎందుకు రావడం లేదు? మధ్యలో ఏమవుతుంది? అని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే ఇసుక బ్లాక్ మార్కెట్ గురించి చెప్పడంతో ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది కేవలం ఆయన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో రీచ్ లెవెల్లో కొందరు ఇసుక దారి మళ్లిస్తుంటే… టెక్నాలజీ వాడి స్థానికంగా అమాయకులకు అధిక ధరకు బ్లాక్ లో బుక్ చేసి ఇసుకను వాడుకుంటున్న పరిస్థితి. దీనిపై విధాన పరమైన నిర్ణయాలు తీసుకుని పరిస్థితి చక్కదిద్దాలని వైసీపీ ఎమ్మెల్యే జెడ్పీ సమావేశంలో కోరారు.