మహానాడు వేదికను బాబు సరిగా వాడుకున్నారా?

యావత్ ప్రపంచం ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్న వేళ.. ఏపీలో రాజకీయం మాత్రం మే ఎండల్ని తలపించేలా హాట్ హాట్ గా ఉండటం ఆ రాష్ట్రానికి మాత్రమే సాధ్యమేమో? ప్రజల ఆరోగ్యం మీద చూపే శ్రద్ధ కంటే తమ రాజకీయాల చుట్టూనే చర్చను పరిమితం చేయటం కనిపిస్తుంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అనవసరమైన చర్చల్ని పక్కన పెట్టి.. ప్రజారోగ్యానికి మేలు చేసే సలహాలు సూచనలు.. పాలకులకు ఇవ్వాల్సిన ప్రతిపక్షం.. ఆ ఊసునే ఎత్తకపోవటం గమనార్హం.

రెండురోజుల పాటు సాగిన మహానాడు వేదిక.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు.. ఆరోపణలు గుప్పించటానికే పరిమితం చేశారని చెప్పాలి. ఎంత వీలైతే.. అంత స్పైసీగా మాట్లాడే ప్రయత్నం చేసిన చంద్రబాబు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రస్తావించకపోవటం విశేషం. అందుకు భిన్నంగా ఎప్పటిలానే రోటీన్ విమర్శలతో సరిపెట్టారు.

పసలేని విమర్శలు చేసే ప్రయత్నం చేయటం.. సర్కారు చేపడుతున్న ప్రతి పనిని విమర్శించే ధోరణి నుంచి చంద్రబాబు బయటకు రాలేదు. గడిచిన కొన్నేళ్లుగా బాబు చెబుతున్న మాటల్నే మరోసారి చెప్పి బోర్ కొట్టించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ2 సాయంతో జగన్ లక్ష కోట్ల అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయారంటూ చెప్పే రొడ్డుకొట్టుడు మాటల్ని ఆయన ఇంకా వదల్లేదు. ఇలాంటి మాటలెన్నో చెప్పిన తర్వాత కూడా 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ చారిత్రక గెలుపును సాధించిన వేళ.. ఆ మాటలకు చెల్లుచీటి చెప్పాల్సిన అవసరం ఉంది.

కానీ.. ఆ పనిని బాబు చేయలేదు. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వంపై వస్తున్న కొన్ని విమర్శల్ని హైలెట్ చేసే ప్రయత్నం చేశారు బాబు. మద్యపాన నిషేధం పేరుతో షాపులు ఓపెన్ చేశారని.. జగన్ కు ఇష్టమైన బ్రాండ్లనే ప్రమోట్ చేశారని.. రేట్లను విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు. పిచ్చి బ్రాండ్లతో రేట్లుపెంచటం వల్ల ఆర్థికంగా.. ఆరోగ్యపరంగా చితికిపోతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు నోట వచ్చిన ఈ మాటల్ని చూసినప్పుడు సామాన్యులకు అంతగా కనెక్టు కావనే చెప్పాలి. ఎందుకంటే.. మద్యపానాన్ని ప్రమోట్ చేయటం కంటే.. తగ్గించాలన్నదే ప్రభుత్వ ఆలోచన అయినప్పుడు.. ధరల్ని భారీగా పెంచటం మందుబాబులకు ప్రోత్సాహకం కంటే కూడా వారిని తాగుడు నుంచి తగ్గించే ప్రయత్నంగా చెప్పాలి.

ఇక.. పిచ్చి బ్రాండ్ల విషయానికి వస్తే.. ఇలాంటి విషయాల్లో ఏ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించదు. ప్రజల ప్రాణాలకు తేడా వస్తే ప్రభుత్వాలకు వచ్చే చెడ్డపేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు.. రిస్కు తీసుకోవటానికి ఏ ప్రభుత్వాధినేత ఆసక్తి చూపరన్నది మర్చిపోకూడదు.

ఇలా చెప్పుకుంటూ పోతే.. బాబు ప్రసంగాల్లో పస కంటే నసే ఎక్కువగా ఉందన్న అభిప్రాయం కలుగక మానదు. అధికారపక్ష నేతను ఉద్దేశించి చేసే ఆరోపణలు.. విమర్శలు ప్రజలు కన్వీన్స్ అయ్యేలా ఉండాలే తప్పించి.. బాబు నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చేలా ఉండకూడదు. అంతేకాదు.. తన నోటి నుంచి వచ్చే మాటలు అధికారపక్షాన్ని ఊపిరాడనివ్వకుండా చేయాలే కానీ.. ఈజీగా ఎదురుదాడి చేసేలా ఉండకూడదన్నది మర్చిపోకూడదు. మరీ విషయాన్ని చంద్రబాబు ఎప్పటికి గుర్తిస్తారో?