బెంగాల్లో మొదలైన నందిగ్రామ్ చిచ్చు

పశ్చిమ బెంగాల్లో అప్పుడో నందిగ్రామ్ చిచ్చు మొదలైపోయింది. నామినేషన్ దాఖలు సందర్భంగా మమతపై దాడి జరిగిందనే ప్రచారంతోనే ఉద్రక్తితలు ఒక్కసారిగా పెరిగిపోయింది. బెంగాల్లోని మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందిగ్రామ్ నియోజకవర్గం ఒకఎత్తు, మిగిలిన 293 నియోజకవర్గాలు ఒకఎత్తు. నందిగ్రామ్ ఎందుకింత చర్చల్లో నడుస్తోందంటే అందుకు మమతాబెనర్జీ-సుబేందు అధికారే కారణమని చెప్పాలి.

దశాబ్దాలుగా సుబేందు అధికారి కుటుంబానిదే నందిగ్రామ్ ప్రాంతంలో ఆధిపత్యం. ఈ ప్రాంతంలోని సుమారు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుబేందు కుటుంబానికి తిరుగులేని పట్టుంది. ఇలాంటి ప్రాంతంలో సంవత్సరాలుగా మమతకు మద్దతుగా నిలిచిన సుబేందు హఠాత్తుగా బీజేపీలో చేరారు. అంటే మమతకు సంవత్సరాలుగా అత్యంత సన్నిహితునిగా ఉన్న సుబేందే ఇపుడు బద్ద వ్యతిరేకయ్యారు. పైగా దమ్ముంటే నందిగ్రామ్ లో పోటీ చేయాలని మమతను సుబేందు సవాలు చేశారు.

సవాలును స్వీకరిచింన మమత వెంటనే నందిగ్రామ్ లో పోటీ చేయటానికి డిసైడ్ అయిపోయారు. దాంతో ఒక్కసారిగా బెంగాలే కాకుండా యావత్ దేశం దృష్టిని నందిగ్రామ్ ఆకర్షించింది. మమత-సుబేందు ఇద్దరు నందిగ్రామ్ లో పోటీ చేస్తున్నారంటేనే హై ఓల్టేజీ టెన్షన్ మొదలైపోయింది. ఇలాంటి నియోజకవర్గంలో మమత మధ్యాహ్నం నామినేషన్ వేశారు. సాయంత్రం బహిరంగసభ జరగటానికి ముందు ఓ దేవాలయానికి వెళ్ళినపుడు ఆమెపై దాడి జరిగింది.

మమతపై జరిగిన దాడితో బెంగాల్ వ్యాప్తంగా ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. తనపై కుట్ర జరిగిందని మమత ఆరోపించారు. మమత పై దాడి అన్నది తృణమూల్ కాంగ్రెస్ డ్రామా అంటు బీజేపీ కొట్టిపారేస్తోంది. ఈ నేపధ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా తృణమూల్ ఆధ్వర్యంలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి. మరి దాడి ఘటన మమత డ్రామానా లేకపోతే దీదీపై ఎవరైనా కుట్ర చేశారా అన్నది సస్పెన్సుగా మిగిలిపోయింది. మొత్తానికి బెంగాల్లో నందిగ్రామ్ చిచ్చు మొదలైందన్నది మాత్రం వాస్తవం. ఈ చిచ్చు చివరకు ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.