ఖుష్బూ వ్యాఖ్యలపై దుమారం

ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది ఒకప్పటి నటి, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన ఖుష్బూ తన పాత పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే భాజపా తీర్థం పుచ్చుకున్న ఆమె.. వెంటనే తన పూర్వ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తాను ఇన్ని రోజులూ మానసిక వికలాంగుల పార్టీలో ఉన్నానని.. ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డానని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల కారణంగా ఖుష్బూ మీద ఒకేసారి 30కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.

ఖుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా ఉన్నాయంటూ ఆ వర్గానికి చెందిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఒకేసారి తమిళనాడులోని 30 పోలీస్ స్టేషన్లలో ఖుష్బూపై ఫిర్యాదు చేశారు. అలాగే కుష్బూపై చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికీ ఫిర్యాదు వెళ్లింది. చెన్నై, కంజిపురం, చెంగల్‌పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్‌ తదితర ప్రాంతాల్లో ఖుష్బూపై కేసులు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఏమైనా మాట్లాడే హక్కు కుష్భూకు ఉన్నప్పటికీ.. అంగ వైకల్యం ఉన్న వారిని కించపరిచేలా పదాలను ఉపయోగించడం ఆమోద యోగ్యం కాదని వారంటున్నారు. ఈ ఫిర్యాదులపై ఖుష్బూ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఉత్తరాది అమ్మాయే అయినప్పటికీ తమిళ సినిమాల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ.. ఆ తర్వాత దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. హీరోయిన్ వేషాలకు గుడ్ బై చెప్పేశాక ఆమె అడపాదడపా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసింది. స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించింది.

దశాబ్దం కిందట డీఎంకే పార్జీతో ఖుష్బూ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కుష్బూ…2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తనకు టికెట్ ఇవ్వకపోవడం, పార్టీలో ప్రాధాన్యం తగ్గడం పట్ల కినుక వహించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి భాజపాలో చేరింది.