ఇలాంటి టైంలో ప్రి రిలీజ్ ఫంక్షనా?

కొత్త సినిమా విడుదల అంటే ప్రమోషన్లు చాలా ముఖ్యం. అందులో అత్యంత ముఖ్యమైన ప్రి రిలీజ్ ఈవెంట్. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకూ ఈ ఈవెంట్ చేయడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా మారింది. అయితే ఆరు నెలలుగా థియేటర్లలో కొత్త సినిమాల విడుదల లేదు. మరి కొన్ని నెలలు ఆ అవకాశాలు కనిపించడం లేదు.

ఇలాంటి టైంలో ఓ కొత్త సినిమాకు ప్రి రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇంకో రెండు రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘వి’ సినిమాకు సంబంధించి ఈ ఈవెంట్ చేస్తుండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 5న, శనివారం ఈ చిత్రం విడుదల కానుండగా.. ముందు రోజు సాయంత్రం 6 గంటల నుంచి ‘వి’ ప్రి రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

ప్రస్తుత కరోనా సమయంలో ఈ ఈవెంట్ ఎక్కడ చేస్తారు.. జనాలను ఎలా అనుమతిస్తారు అని సందేహం కలగొచ్చు. కానీ లాక్ డౌన్ టైంలో అలవాటు పడ్డ వర్చువల్ స్టయిల్లోనే ఈ ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్‌కు వెన్యూగా ‘మీ స్క్రీన్లు’ అని చిత్ర బృందం పేర్కొనడం విశేషం. అంటే చిత్ర బృందం అంతా ఒక చోటికి చేరి అక్కడి నుంచే తమ సినిమా గురించి మాట్లాడుతుందన్నమాట.

వాళ్లతో వర్చువల్‌గా కనెక్ట్ అయి ఈ ఈవెంట్లో భాగం కావచ్చు. ప్రధాన తారాగణం అయిన నాని, సుధీర్ బాబు, అదితి రావు హైదరి, నివేథా థామస్‌లతో పాటు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ, నిర్మాత దిల్ రాజు ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. టాలీవుడ్లో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి.. నేరుగా ఓటీటీలో రిలీజవుతున్న పెద్ద సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది జనాల్లో. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ‘వి’ స్ట్రీమ్ కాబోతోంది. ఈ సినిమాకు ఎలాంటి స్పందన వస్తుందో అని చిత్ర బృందమే కాదు.. ఇండస్ట్రీ జనాలు, ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.