‘విరాటపర్వం’కు అదే పెద్ద సమస్య

రెండు రోజుల కిందటే విడుదలైంది ‘విరాటపర్వం’ టీజర్. ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా ఇంటెన్స్‌గా సాగిన టీజర్.. ఒక గొప్ప చిత్రాన్ని చూడబోతున్న భావన కలిగించింది. టీజర్లో ప్రతి డైలాగ్.. ప్రతి విజువల్.. ప్రతి షాట్‌.. ఎంతో ఇంటెన్స్‌గా.. ఉద్వేగభరితంగా కనిపించాయి. నటీనటుల హావభావాల గురించి చెప్పాల్సిన పని లేదు. టీజర్లో ఒక క్లాసిక్ టచ్ కనిపించింది. ఐతే ఈ సినిమాతో ఉన్న ఒకే ఒక్క సమస్య.. ఇందులో చూపించిన విషయాలతో ఈ తరం ప్రేక్షకులు ఏమాత్రం కనెక్టవుతారన్నదే.

నక్సలిజం నేపథ్యంలో ఒకప్పుడు ఎన్నో సినిమాలు వచ్చాయి. ‘సింధూరం’, ‘శ్రీరాములయ్య’, ‘ఎన్‌కౌంటర్’ లాంటి సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను కదిలించాయి. కానీ వాటికి అప్పట్లో కమర్షియల్‌గా అంత మంచి ఫలితం దక్కని విషయం గమనార్హం. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నక్సలిజం ప్రభావం ఎంతో ఉండేది. జనాల్లో ఎప్పుడూ దాని గురించి ఒక చర్చ నడిచేది. వార్తా పత్రికల్లో కూడా నక్సలిజం సంబంధిత వార్తలు లేని రోజులే ఉండేవి కావు. అప్పుడు నక్సలిజం నేపథ్యంలో సినిమాలు కూడా తరచుగా వస్తుండేవి. వాటికి ఆదరణ ఏ స్థాయిలో ఉండేదన్నది పక్కన పెడితే.. ఆ సినిమాలకు జనాలు రిలేట్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత దశాబ్ద కాలంలో నక్సలిజం ప్రభావం బాగా తగ్గిపోయింది. దాని గురించి ఎక్కడా పెద్దగా చర్చ లేదు. మీడియా దృష్టే దానిపై లేదు.

ఇలాంటి సమయంలో ఆ బ్యాక్‌డ్రాప్‌లో సీరియస్ సినిమా తీస్తే జనాలు ఏ మేర కనెక్ట్ అవుతారన్నది ప్రశ్నార్థకం. 90ల్లో పరిస్థితుల మీద అవగాహన ఉన్న వాళ్ల సంగతి ఓకే కానీ.. సినిమాకు మహరాజ పోషకులైన యువత.. ఈ సినిమాతో ఏ మేర రిలేటవుతారన్నది సందేహం. పైగా ఈ తరం ప్రేక్షకులు ఎంటర్టైనర్లకే పెద్ద పీట వేస్తున్నారు. సీరియస్ సినిమాలను అంతగా ఆదరించట్లేదు. ఈ నేపథ్యంలో ‘విరాటపర్వం’ ఏ మేర ప్రేక్షకాదరణ పొందుతుందో చూడాలి.