కాపుల‌పై మ‌న‌సుంటే.. జ‌గ‌న్‌కు ఇదే స‌రైన స‌మ‌యం!!

రాష్ట్రంలో కాపు సామాజిక వ‌ర్గం కొన్ని ద‌శాబ్దాలుగా త‌మ రిజ‌ర్వేష‌న్ అంశంపై పోరాటాలు చేసిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా చంద్ర‌బాబు పాల‌నా కాలంలో.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం నేతృత్వంలో రాష్ట్ర‌వ్యాప్తంగా కాపు సామాజిక వ‌ర్గం త‌మ రిజ‌ర్వేష‌న్ల‌ను తేల్చాల‌ని.. డిమాండ్ చేస్తూ.. అనేక రూపాల్లో ఉద్య‌మించింది. ఈ క్ర‌మంలో అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు.. బీసీ సామాజిక‌వ‌ర్గానికి అమ‌లు చేస్తున్న 50 శాతం రిజ‌ర్వేష‌న్‌పై మ‌రో ఐదు శాతం కాపుల‌కు అమ‌లు చేస్తామ‌ని.. దీనికి అనుమ‌తించాల‌ని కోరుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు పంపారు.

ఎందుకంటే.. రిజ‌ర్వేష‌న్ల అంశం.. కేంద్రంతో ముడిప‌డిన‌, పార్ల‌మెంటు వ్య‌వ‌హారంతో ముడిప‌డిన వ్య‌వ‌హారం కావ‌డ‌మే. అయితే.. అప్ప‌ట్లోనూ ఉన్న మోడీ స‌ర్కారు.. దీనిపై మౌనం దాల్చింది. ఇంత‌లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ 10 శాతంలో చంద్ర‌బాబు కాపుల‌కు 5 శాతం ఇచ్చేసి.. త‌న నిజాయితీని నిరూపించుకున్నార‌ని.. కాపు మేధావులు అంటారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర చేసిన వైసీపీ అధినేత‌, ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్‌.. కాపుల రిజ‌ర్వేష‌న్ అంశంపై తాను ఏమీ చేయ‌లేన‌ని.. ఇది కేంద్రం ప‌రిధిలోని అంశ‌మ‌ని పేర్కొంటూ.. చేతులు ఎత్తేశారు.

ఇక‌, అప్ప‌టికే చంద్ర‌బాబు కూడా తీర్మానం చేసి ఉండ‌డం.. మోడీ స‌ర్కారు ప‌క్క‌న ప‌డేయ‌డం వంటివి చూసిన వారు స‌రే అనుకున్నారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్‌కు ఒక చ‌క్క‌టి అవ‌కాశం వ‌చ్చింది. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర స‌ర్కారు.. ఇదే రిజ‌ర్వేష‌న్ల అంశంపై ఏకంగా సుప్రీం కోర్టులో కేసు వేసింది. ప్ర‌స్తుతం 50 శాతానికే ప‌రిమిత‌మైన రిజ‌ర్వేష‌న్ల వ‌ల్ల రాష్ట్రంలో మ‌రాఠా వ‌ర్గానికి రిజ‌ర్వేష‌న్ ఫ‌లాలు అంద‌డం లేద‌ని.. సో.. దీనిని పెంచుకునేందుకు అనుమ‌తించాల‌ని కోరుతూ.. ప్ర‌భుత్వం కేసు వేసింది. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ‌లు సాగుతున్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు తాజాగా.. ఏపీకి ఆనుకుని ఉన్న క‌ర్ణాట‌క స‌ర్కారు కూడా అక్క‌డ అమ‌ల‌వుతున్న 50 శాతం రిజ‌ర్వేష‌న్ల‌కు మ‌రింత పెంచాల‌ని నిర్ణ‌యించింది.

తాజాగా కేబినెట్ భేటీలో మాట్లాడిన సీఎం య‌డియూర‌ప్ప‌(బీజేపీ) 1981 జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం చేసిన రిజ‌ర్వేష‌న్ ప‌రిమితి 50 శాతం ఇప్పుడు పెరిగిన జ‌నాభాతో స‌రిపోవ‌డం లేదు క‌నుక తాము మ‌రో 6 నుంచి 8 శాతం రిజ‌ర్వేష‌న్‌లు పెంచాల‌ని భావిస్తు న్నామ‌ని.. సో దీనికి అనుమ‌తించాల‌ని కోరుతూ.. ఆయ‌న సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జాట్ల విష‌యంలో రాజ‌స్థాన్ కూడా కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. ఏపీ ప్ర‌భుత్వం కూడా అంటే.. సీఎం జ‌గ‌న్ కూడా కాపుల రిజ‌ర్వేష‌న్ అంశాన్ని ప్ర‌త్యేకంగా తీసుకుని.. కేబినెట్‌లో ఒక తీర్మానం చేసి.. సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేస్తే త‌న నిజాయితీని నిరూపించుకునే అవ‌కాశం ఉంది.

కేవ‌లం మాట‌ల‌కే ప‌రిమితం కాకుండా.. చేత‌ల ద్వారా త‌న నిజాయితీని నిరూపించుకునేందుకు కాపుల‌కు ప్ర‌స్తుతం ఉన్న 50 శాతం రిజ‌ర్వేష‌న్‌పై మ‌రో ఐదు శాతం క‌ల్పించేలా చ‌ర్య‌ల‌కు దిగాల్సిన స‌మ‌యం ఇదేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు. బీజేపీ పాలిత క‌ర్ణాట‌క ప్ర‌భుత్వ‌మే కోర్టుకు వెళ్ల‌గా లేనిది .. జ‌గ‌న్ వెళ్తే త‌ప్పులేద‌ని.. ఇప్ప‌టికైనా కాపుల‌కు న్యాయం చేయాల‌ని ఆయా వ‌ర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి జ‌గ‌న్ ఆదిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారో.. లేక .. రాజ‌కీయ క‌న్నీటి కోసం కాపుల‌ను వాడుకుంటారోచూడాలి.