ప‌డి లేచిన ‘టీడీపీ’.. 2022 మిగిల్చింది ఇదే!

2022వ సంవ‌త్స‌రం.. ఏపీలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీకి పెద్ద సానుకూల సంవ‌త్స‌ర‌మ‌నే చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం చ‌విచూసిన టీడీపీప‌ని అయిపోయింద‌ని.. ఇక‌, పార్టీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేద‌ని.. జ‌రిగిన ప్ర‌చారానికి ఈ సంవ‌త్స‌రం చెక్ పెట్టింది. ముఖ్యంగా పార్టీ జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు రెట్టించిన ఉత్సాహం తో ముందుకు క‌దిలారు. అధికార పార్టీ వైసీపీ దుర్నీతిని అడుగ‌డుగునా ఎండ‌గట్టారు. అంతేకాదు.. పార్టీ నాయ‌కుల‌ను పెద్ద ఎత్తున ముందుకు త‌ర‌లించి.. పార్టీని పుంజుకునే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు.

బాదుడే బాదుడు, ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి వంటి కార్య‌క్ర‌మాల ద్వారా.. ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు చేసిన ప్ర‌య‌త్నం స‌క్సెస్ అయింది. పోలీసుల నుంచి ఎదురైన ఆంక్ష‌ల‌ను సైతం తోసిరాజ‌ని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌ను న‌మ్ముకుని.. వెన్ను చూప‌ని విధంగా తెలుగు దేశం పార్టీ ముందుకు సాగింద‌నే చెప్పాలి. ఇక‌, జాతీయ‌స్తాయిలో చంద్ర‌బాబు మ‌రోసారి వెలిగారు. జీ-20 దేశాల‌కు నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు స్వీక‌రించిన భార‌త్‌.. ఈ క్ర‌మంలో నిర్వ‌హించిన స‌న్నాహ‌క కార్య‌క్ర‌మానికి చంద్ర‌బాబును సైతం ఆహ్వానించింది. ఈ స‌మ‌యంలో చంద్ర‌బాబు చేసిన సూచ‌న‌(25 ఏళ్ల‌ను దృష్టిలో పెట్టుకుని ఒక విధానాన్ని రూపొందించాలి)ను ప్ర‌ధాని ఎన్న‌ద‌గిన సూచ‌న‌గా పేర్కొన్నారు.

ఇక‌, రాష్ట్ర స్థాయిలో టీడీపీకి అప్ప‌టి వ‌ర‌కు జ‌నం లేర‌ని.. జ‌నాలు మ‌రిచిపోయార‌ని చెబుతూ వ‌చ్చిన వైసీపీకి టీడీపీ స‌భ‌లు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాయి. రోడ్ షోల‌కు ప్ర‌జ‌లు పోటెత్తారు. చంద్ర‌బాబు నిర్వ‌హించిన స‌భ‌ల‌కు ఎక్క‌డెక్క‌డ‌నుంచో ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌చ్చారు. అదేస‌మ‌యంలో పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసేందుకు నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చంద్ర‌బాబు చేసిన స‌మీక్ష‌లు.. పార్టీనేత‌ల మ‌ధ్య లొసుగులు.. త‌గ్గించే చ‌ర్య‌లు కూడా స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చాయి. మ‌రోవైపు.. తెలంగాణ‌లో బీసీ నేత‌కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించ‌డం ద్వారా.. పార్టీ బీసీల‌దేన‌ని చెప్పుకోవ‌డంలోనూ చంద్ర‌బాబు స‌క్సెస్ సాధించారు.

పంటి కింద రాళ్లు!
అయితే.. ఎంత చేసినా.. ఎన్ని ర‌కాలుగా పార్టీ పుంజుకున్నా.. పంటికింద రాళ్ల‌లా చోటు చేసుకున్న కొన్న ప‌రిణామాలు.. టీడీపీని కుదిపేశాయి. ఒక‌టి మాజీ మంత్రి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీలు.. ప‌దే ప‌దే చంద్ర‌బాబు కుటుంబంపై వ్యాఖ్య‌లు చేయ‌డం. రెండోది.. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లు పార్టీని ఇబ్బంది పెట్టాయనే చెప్పాలి. అయితే.. ఇదే స‌మ‌యంలో పార్టీ భ‌విష్య ప్ర‌ణాళిక‌.. ‘యువ‌గ‌ళం’ పేరిట నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధం కావ‌డం.. ఈ ఏడాది టీడీపీలో జోష్ నింపే ప్ర‌య‌త్న‌మ‌నే అని చెప్ప‌క త‌ప్ప‌దు.