లాంగ్ అవైటెడ్ మూవీ.. రిలీజ్‌కు రెడీ

2000 తర్వాత సౌత్ ఇండియన్ సినిమాలో అరంగేట్రం చేసిన దర్శకుల్లో టాప్ లెవెల్లో నిలిచే వాళ్లలో గౌతమ్ మీనన్ ఒకడు. ‘చెలి’ లాంటి మంచి ప్రేమకథతో పరిచయం అయిన అతను.. ఆ తర్వాత ‘కాక్క కాక్క’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘ఏమాయ చేసావె’, ‘వేట్టయాడు విలయాడు’ లాంటి మేటి చిత్రాలతో గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించాడు.

అతడి నుంచి ఇలాంటి మరెన్నో ఎగ్జైటింగ్ సినిమాలను ప్రేక్షకులు ఆశించారు. కానీ గౌతమ్ ప్రొడక్షన్లోకి అడుగు పెట్టి ఫైనాన్స్ గొడవల్లో చిక్కుకుని సినిమాలు తీయలేని, తీసినా రిలీజ్ చేసుకోలేని పరిస్థితుల్లో పడిపోయాడు. అతను దర్శకత్వం వహించిన, ప్రొడ్యూస్ చేసిన మూణ్నాలుగు సినిమాలు కొన్నేళ్ల పాటు విడుదలకు నోచుకోకుండా ఆగిపోయాయి. వాటిలోంచి ఒక్కోదాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్ సినిమా ‘ఎన్నై నొక్కి పాయుం తోటా’ను రిలీజ్ చేయగలిగాడు. అది తీవ్ర నిరాశను మిగిల్చింది.

తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. మరో లాంగ్ డిలేయ్డ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అదే.. ధృవనక్షత్రం. సీనియర్ హీరో విక్రమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఇది. ‘పెళ్లిచూపులు’ హీరోయిన్ రీతూ వర్మ ఇందులో కథానాయికగా నటించగా.. సిమ్రాన్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. ఒక పోలీస్ టీంకు, టెర్రరిస్టులకు మధ్య జరిగే దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ ఇది. నాలుగేళ్ల ముందే గౌతమ్ ఈ సినిమాను మొదలుపెట్టాడు.

చాలా వరకు చిత్రీకరణ కూడా పూర్తి చేశాడు. కానీ చివరి దశలో బ్రేక్ పడింది. కొన్నేళ్ల పాటు వార్తల్లో లేని ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో గౌతమ్ సినిమా ప్రమోషన్లను మొదలుపెట్టాడు. ఈ చిత్రం నుంచి ఒక పాటను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ అప్ డేట్ ఇచ్చాడంటే త్వరలోనే సినిమా విడుదలవుతున్నట్లే. మరి ఈ సినిమా అయినా ‘గౌతమ్ ఈజ్ బ్యాక్’ అనిపిస్తుందేమో చూడాలి.