సినీ పరిశ్రమ ఇకపై ఉపేక్షించబోదు

నాగార్జున కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ నోరు పారేసుకోవడం వల్ల పెను దుమారం రేగడం గత పన్నెండు గంటలకు పైగా చూస్తూనే ఉన్నాం. ఆవిడ క్షమాపణ కోరింది కానీ అభిమానులు, సగటు జనాల్లో ఆగ్రహావేశాలు పూర్తిగా చల్లారలేదు.

రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా ఉండే అక్కినేని ఫ్యామిలీకి మచ్చ వచ్చేలా మాట్లాడ్డమే కాకుండా ఏ మాత్రం ఆధారాలు లేని ఒక నిందను అంత బహిరంగంగా చెప్పడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. మాములుగా రాజకీయ నాయకుల కామెంట్లకు వీలైనంత దూరంగా ఉండే టాలీవుడ్ పెద్దలు, తారలు ఈసారి మౌనంగా ఉండలేకపోయారు.

జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, వెంకటేష్, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, నాని, మంచు లక్ష్మి, వరుణ్ తేజ్, శ్రీకాంత్ ఓదెల తదితరులు ఈ సంఘటన పట్ల తీవ్రంగా వ్యతిరేకత ప్రకటిస్తూ సమంతా, చైతులకు సంఘీభావం తెలిపారు. మా అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఇలాంటివి ఉపేక్షించబోమంటూ ఒక లేఖ విడుదల చేశారు.

ఆర్టిస్టులందరూ ‘ఫిలిం ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్’ (సినిమా పరిశ్రమ దీన్ని ఉపేక్షించదు) అని ట్యాగ్ పెట్టి తమ మనసులో మాటలు పంచుకుంటున్నారు. సెలబ్రిటీలు భాగం కావడంతో రాత్రి నుంచే వేలాది ట్వీట్లు ఈ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికపై వైరల్ కావడం మొదలయ్యాయి.

జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ టాలీవుడ్ మాత్రం తామంతా ఒకే కుటుంబమనే సందేశాన్ని బలంగా ఇచ్చింది.

గతంలో పవన్ కళ్యాణ్, నారా భువనేశ్వరి, రజనీకాంత్, చిరంజీవిలకు వివిధ స్థాయిలో అవమానాలు జరిగినప్పుడు ఇదే తరహాలో ఎందుకు స్పందించలేదనే కామెంట్స్ ఇప్పుడు వస్తున్నప్పటికీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. వాళ్లంతా ప్రత్యక్షంగానో పరోక్షంగానో పొలిటిక్స్ తో ముడిపడిన వాళ్ళు. అందుకే స్టార్లు ఆచితూచి స్పందించారు. కానీ ఇప్పుడు టార్గెట్ అయ్యింది రాజకీయంతో సంబంధమే లేని ఏఎన్ఆర్ ఫ్యామిలీ మీద. అందుకే ఇంత రెస్పాన్స్.