రూ.2 వేల కోట్ల ట్రేడింగ్ స్కాంలో నటి అరెస్టు

అసోంలో సంచలనంగా మారిన ఒక ఆన్ లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నటి సుమిబోరాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాంకు సంబంధించిన కేసులో ఇప్పటికే వీరిపై లుకౌట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి. ఆమెతో పాటు ఆమె భర్తను కూడా అరెస్టు చేశారు. నిజానికి ఈ కుంభకోణం మొదట్లో రూ.22వేల కోట్లుగా చెప్పగా.. ఆ తర్వాత దాన్ని రూ.2వేల కోట్లుగా మాత్రమేనని తేల్చారు.

పెట్టుబడులు రెట్టింపు చేస్తామంటూ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ మెంట్ల పేరుతో ప్రజల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడిన వారు.. భారీగా వసూళ్లు చేపట్టారు. 60 రోజుల్లో 30 శాతం రాబడి వస్తుందని.. దీనికి కేవలం రెండు నెలలు వ్యవధి మాత్రమేనంటూ ఊరించారు.

ఇందులో భాగంగా నాలుగు నకిలీ సంస్థల్ని ఏర్పాటు చేశారు. అసోం చిత్రపరిశ్రమలో పెట్టబుడులు పెట్టారు. పలు ఆస్తుల్ని కూడబెట్టారు. కానీ..నమ్మి పెట్టుబడుల్ని పెట్టినోళ్లను మాత్రం నట్టేట ముంచేశారు.

ఈ కుంభకోణంలో సినీ నటి.. ఆమె భర్తతో పాటు పలువురి మీద ఆరోపణలు ఉన్నాయి. వీరిపై అంతకంతకూ పెరిగిన ఫిర్యాదుల నేపథ్యంలో వారికి నోటీసులు ఇచ్చి.. పోలీసుల ఎదుట హాజరు కావాలని కోరారు. అయితే.. అందుకు వారు స్పందించకపోవటంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ ఉదంతం ఆ రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంపై సదరు నటి ఒక వీడియోను విడుదల చేశారు.

తమ పరువునకు నష్టం వాటిల్లేలా ప్రచారం చేస్తున్నారని.. తన కుటుంబంపై వస్తున్న వార్తల నేపథ్యంలో తానే పోలీసుల ఎదుట లొంగిపోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. తాను విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న కథనాలతో తమకు పెద్ద ఎత్తున వేధింపులు ఎదురయ్యాయని.. అందుకే అందరికి దూరంగా ఉన్నామన్నారు. తమపై వస్తున్న వార్తల్లో పది శాతం కూడా నిజం లేదన్న ఆమె.. పోలీసుల ఎదుట లొంగిపోతానని పేర్కొన్నారు. అయితే.. అదే రోజు ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ స్కాం తొలుత రూ.22వేల కోట్లుగా ప్రచారం జరిగినా.. ఆ తర్వాత పోలీసులు సైతం రూ.2వేల కోట్లుగా తేల్చారు.