‘మనమే’ వెనుక మహా మోసం

శర్వానంద్ నటించిన మనమే థియేటర్లలో గొప్ప ఫలితం అందుకోలేదు కానీ ఉన్నంతలో ఓ మోస్తరుగా ఆడి సెలవు తీసుకుంది. ఇది జరిగి రెండు నెలలు దాటినా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. హీరోయిన్ కృతి శెట్టి, హేశం అబ్దుల్ వహాబ్ సంగీతం, చైల్డ్ సెంటిమెంట్ ఇలా ఎన్నో ఆకర్షణలు డిజిటల్ ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేశాయి. కానీ రోజులు గడిచే కొద్దీ కాలం కరిగిపోతోంది కానీ మనమే దర్శనం మాత్రం జరగలేదు. అదిగో ఇదిగో అంటూ ఊరించడమే తప్ప అప్డేట్ రాలేదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ లాంటి పెద్ద సంస్థ తీసిన మూవీకి ఇలా జరగడం ఆశ్చర్యం. ఫైనల్ గా క్లారిటీ వచ్చింది.

ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ స్పష్టత ఇచ్చారు. నాన్ థియేట్రికల్ రైట్స్ ని మూడో పార్టీ ద్వారా ముందే అమ్మేశామని, కానీ వాళ్ళు మోసం చేయడం వల్ల 70 నుంచి 80 శాతం దాకా పెట్టుబడి నష్టపోయినట్టు వివరించారు. అంతేకాదు ప్రస్తుతం కేసు కోర్టులో ఉన్నందువల్ల త్వరలోనే న్యాయం జరిగి సినిమా బయటికి వచ్చాక అప్పుడు మోసగాళ్ల తాలూకు డీటెయిల్స్ వెల్లడిస్తానని అన్నారు. అయితే ఆ ఛీటర్ ఎవరనే దాని గురించి రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. పలు నిర్మాతలు ఇదే తరహాలో మోసానికి గురైనప్పటికీ ఇతరత్రా కారణాల వల్ల మౌనంగా ఉన్నారు.

ఈ వివాదం బయటికి రావడం మంచిదే. ఎందుకంటే ఇండస్ట్రీలో ఓటిటి బిజినెస్ పేరుతో కొందరు బ్లాక్ మైలర్స్ గా మారిపోయారు. తక్కువ ధరకు ప్రొడ్యూసర్ దగ్గర హక్కులు కొని వాటిని స్ట్రీమింగ్ కంపెనీలకు ఎక్కువ రేట్ కి అమ్మడమో లేదా పే పర్ వ్యూలో అధిక సొమ్ములు చేసుకుని దాన్ని నిర్మాతకు చెప్పకుండా మేనేజ్ చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. విశ్వప్రసాద్ కుండబద్దలు కొట్టేయడంతో మరికొందరు దీని గురించి నోరు విప్పే ఛాన్స్ ఉంది. మనమే లాంటి మ్యూజికల్ ఎంటర్ టైనర్ స్క్రీన్ మీద ఆడకపోయినా ఇంట్లో చూడాల్సిన ఎంటర్ టైనరే. ఇదండీ లేటు వెనుక అసలు స్టోరీ.