ఏదో దాస్తున్నారు: కోల్‌క‌తా హ‌త్యాచారం కేసులో సుప్రీంకోర్టు

కోల్‌క‌తాలో జూనియ‌ర్ వైద్యురాలి హ‌త్యాచారం ఘ‌ట‌నకు సంబంధించిన కేసును సుమోటోగా స్వీక‌రించి న సుప్రీంకోర్టు మంగ‌ళ‌వారం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా హ‌త్యాచారం ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరును తీవ్ర‌స్థాయిలో త‌ప్పుబ‌ట్టింది. ఏదో దాస్తున్నారంటూ.. స‌ర్కారు తీరు పైనా అనుమానాలు వ్య‌క్తం చేసింది. కేసు ద‌ర్యాప్తు స‌హా .. ఎఫ్ ఐఆర్ న‌మోదు విష‌యంలో పోలీసుల అల‌స‌త్వం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని ధ‌ర్మాస‌నం మండిప‌డింది.

హ‌త్యాచారం కేసును విచారించిన ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం… జూనియ‌ర్ వైద్యురాలి మృత‌దేహాన్ని అంత్య‌క్రియ‌ల‌కు అప్ప‌గించిన.. మూడు గంట‌ల త‌ర్వాత‌.. ఎఫ్ ఐఆర్‌ను న‌మోదు చేయ‌డం ఏంట‌ని నిల‌దీసింది. అదేస‌మ‌యంలో ఈ నెల 14న ఆర్‌జీ క‌ర్ ఆసుప‌త్రిపై జ‌రిగిన దాడిని కూడా ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించింది. ఇంత జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించింది. ప్ర‌భుత్వం ఉందా.. లేదా అన్న‌ట్టు ప‌రిస్థితి మారిపోయింద‌ని వ్యాఖ్యానించిం ది.

మీడియాపైనా..

మొత్తం వ్య‌వ‌హారంలో ఏదో దాస్తున్న‌ట్టు అనిపిస్తోందని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం వ్యాఖ్యానించింది. ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ తీరుపై కూడా ధ‌ర్మాస‌నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారని నిలదీసింది. ఇక‌, మీడియా అత్యుత్సాహంపైనా అక్షింత‌లు వేసింది. కొన్ని మీడియా సంస్థలు బాధితురాలి ఫొటో, పేరును వెలుగులోకి తీసుకురావ‌డంపై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేసింది. హత్యాచార ఘ‌ట‌నల‌పై సంయ‌మ‌నం పాటించ‌లేరా? అని మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది.

వైద్యులకు భ‌ద్ర‌త‌

విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న వైద్యుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాల్సిన అవ‌స‌రం ప్ర‌భుత్వాల‌కు ఉంద‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. దీనికోసం విధివిధానాల‌ను రూపొందించేందుకు ఓ జాతీయ టాస్క్‌ ఫోర్స్‌ను ధ‌ర్మాస‌నం ఏర్పాటు చేసింది. దీనిలో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ నేషనల్‌ గ్యాస్ట్రాలజీ ఎండీ డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి, సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆరే సరిన్‌ తదితరులు సభ్యులుగా ఉంటారని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ చంద్ర‌చూడ్ తెలిపారు.