జూనియర్ డాక్టర్ హత్యాచారం ఎంత పాశవికమో చెబుతున్న రిపోర్టు

నిజానికి ఈ వార్త రాస్తున్నప్పుడు మనసు ఎంతో వేదనకు గురైంది. మనిషిలోని పశుత్వం కాదు.. పైశాచికత్వం ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టేలా ఉన్న వివరాలు చదువుతున్న కొద్దీ వణికిపోతున్న పరిస్థితి. ఎంత ఆటవికంగా.. మరెంత అమానుషంగా హత్యాచారానికి పాల్పడ్డారన్నది పోస్టు మార్టం రిపోర్టులోని వివరాల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అవును.. మీరు ఊహించింది కరెక్టే. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యాచారానికి సంబంధించి విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న బాధితురాలిని హాస్పిటల్ లోనే హత్యాచారానికి పాల్పడటం.. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన.. ఆందోళన వ్యక్తం కావటం తెలిసిందే. జూనియర్ డాక్టర్ గా రాత్రి వేళ విధులు నిర్వర్తించేందుకు ఆసుపత్రికి వచ్చిన ఆమె.. తర్వాతి రోజు ఉదయం సెమినార్ హాల్లో అర్థనగ్న స్థితిలో కనిపించటం.. ఆమెను చంపేసిన విధానం కడుపు తిప్పేలా ఉన్న సంగతి తెలిసిందే.

జూనియర్ డాక్టర్ హత్యాచారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు.. ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లుగా అనుమానిస్తున్న నిందితుడు సంజయ్ రాయ్ ను పోలీసులు అరెస్టు చేయటం తెలిసిందే. షాకింగ్ నిజం ఏమంటే.. తాజాగా ఆమె పోస్టుమార్టం రిపోర్టు కొత్త విషయాల్ని వెలుగులోకి వచ్చేలా చేసింది. ఆమెపై జరిగింది హత్యాచారం కాదని.. గ్యాంగ్ రేప్ తో పాటు చంపేశారన్న నిజం వెలుగు చూసింది.

అంతేకాదు.. ఆమె పోస్టుమార్టం రిపోర్టులోని అంశాలు చూస్తే.. ఆమెను ఎంత క్రూరంగా హింసించి చంపారో అర్థమవుతుంది. ఆమె ప్రైవేట్ పార్ట్స్ తో పాటు కళ్లు.. నోటి నుంచి బ్లీడింగ్ కావటం.. ముఖం.. గోళ్లపై గాయాలు.. కడుపు.. ఎడమ కాలు.. మెడ.. కుడి చేయి.. పెదవులు.. చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడినట్లుగా వైద్యులు తమ రిపోర్టులో వెల్లడించారు.

ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉన్నట్లుగా పోస్టు మార్టం పేర్కొంది. దీని ప్రకారం చూస్తే.. ఆమెను ఒకరు కాకుండా గ్యాంగ్ రేప్ చేసి ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని బాధితురాలి తల్లిదండ్రులు కోర్టులో వేసిన కేసులో ఈ విషయాల్ని ప్రస్తావించినట్లుగా పలు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారం చేయటంతో పాటు.. ఆధారాలు మిగలకుండా ఉండేందుకు హతమార్చి ఉంటారని భావిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత.. ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరాన్ని ఇందులోని వివరాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. ఇంత క్రూరంగా హింసించిన వారు ఎవరైనా సరే.. కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూద్దాం.