‘హ‌జ్‌’.. ఓ విషాద యాత్ర‌.. 500ల‌కు పైగా మృతి?

ముస్లిం స‌మాజం జీవితంలో ఒక్క‌సారైనా హ‌జ్ యాత్ర చేయాల‌ని క‌ల‌లు కంటుకుంది. ఇప్పుడు భార‌త్ స‌హా ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్ర‌భుత్వాలు కూడా.. హ‌జ్ యాత్ర‌కు విశేష ప్రాధాన్యం ఇస్తున్నాయి. దీంతో ఒక‌ప్పుడు ప్ర‌యాణ సౌక‌ర్యాలు అంతంత మాత్రంగా ఉండ‌గా.. ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాలు.. రాజ‌ధాని ప్రాంతాల నుంచి హ‌జ్‌కు వెళ్లే విమానాలు.. యాత్రికుల సంఖ్య పెరిగింది. ఈ యాత్ర అంటేనే ముస్లింలకు మాత్ర‌మే ప్ర‌త్యేకం. అలాంటి ఈ యాత్ర ఈ సారి.. విషాదాన్ని నింపేసింది.

ప్ర‌స్తుతం మ‌రో రెండు రోజుల్లో ఈ యాత్ర ముగియ‌నుంది. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్య‌మైన ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గ‌డిచిన ప‌ది రోజుల్లో 550 మందికి పైగా యాత్రికులు మృతి చెందినట్టు సౌదీ ప్ర‌భుత్వం అధికారికంగా ప్ర‌క‌టించింది. అన‌ధికారికంగా ఈ సంఖ్య 1000కి పైనే ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ముస్లింలు.. ఎంతోభ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో హ‌జ్ యాత్ర చేస్తారు. మ‌క్కా, మ‌దీనాల‌ను సంద‌ర్శించుకుంటారు.

అయితే.. ఈ యాత్ర పైకి చెప్పుకొన్నంత తేలిక కాదు.. విప‌రీత‌మైన ర‌ద్దీ నెల‌కొంటుంది. క‌నీసం.. ఒక చోట ప‌ట్టుమ‌ని ప‌ది నిమిషాలు కూర్చుకునే స‌దుపాయాలు కూడా ఉండ‌వు. దీనికి తోడు.. 50 డిగ్రీల‌కు చేరుకున్న ఉష్ణోగ్ర‌త‌లు.. హ‌జ్‌యాత్రికుల‌కు ఈ సారి చుక్క‌లు చూపిస్తున్నాయి. ఈ వేడిని త‌ట్టుకోలేక‌.. అనేక మంది యాత్రికులు పిట్ట‌లు రాలిన‌ట్టు రాలుతున్నారు. ఉష్ణోగ్ర‌త‌ల‌ను ముందుగానే అంచ‌నావేసినా.. ప్ర‌త్యేకంగా బ‌హిరంగ ప్రాంతాల్లోనూ చ‌లువ గాలిని ఇచ్చే ఏసీల‌ను, కూల‌ర్ల‌ను ఏర్పాటు చేసినా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు.

దీంతో యాత్రికులు కూర్చున్న వారు కూర్చున‌ట్టుగా ప్రాణాలు వ‌దులుతున్నారు. ఇలా చ‌నిపోయిన‌ వారిలో ఈజిప్ట్‌, జోర్డాన్‌ దేశస్తులు అధికంగా ఉన్నారని సౌదీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. చ‌నిపోయిన వారిలో 300ల‌కుపైగా ఈజిప్టియన్లు ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. అలాగే 60 మంది జోర్డానియన్లు కూడా మ‌ర‌ణించార‌ని తెలిపారు. మొత్తంగా ఇప్ప‌టివ‌ర‌కు చ‌నిపోయిన వారి సంఖ్య 577కి చేరిన‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప‌రిస్థితి ఇప్ప‌టికీ ప్ర‌మాద‌క‌రంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.