ఏపీ అప్పుల లెక్క తేలుస్తున్నారు!

ఏపీలో కొత్త‌గా గెలిచిన కూట‌మి పార్టీలు.. అధికారం చేప‌ట్టేందుకు నాలుగు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఇంత‌లోనే కీల‌క ప‌రిణామాలు.. సంచ‌ల‌న ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ కుమార్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై ఉన్న‌త‌స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ స‌మీక్ష‌లో ఏపీ అప్పుల లెక్క తేల్చాల‌ని.. సీఎస్ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ ఆదేశించారు. ఎక్క‌డెక్క‌డ ఎంతెంత అప్పులు తెచ్చారు. ఏయే ప‌థ‌కాల‌కు వాటిని మ‌ళ్లించారు? అనే విష‌యాల‌పై 24 గంట‌ల్లోగా త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించారు.

అదేస‌మ‌యంలో ఎన్నిక కార్పొరేష‌న్ల ఆస్తుల‌ను అడ్డు పెట్టుకుని అప్పులు తెచ్చారో.. కూడా తేల్చాల‌ని సీఎస్ ఆదేశించిన‌ట్టు స‌మాచారం. దీంతో ఇప్పుడు ఆర్థిక శాఖ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

కొత్త‌గా కొలువు దీర‌నున్న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం.. తెలంగాణ త‌ర‌హాలోనే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్తితిపై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని.. నిర్ణ‌యించుకున్న వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో సీఎస్ ఆదేశాల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి సత్యనారాయణ వైసీపీ హ‌యాంలో ఆర్థిక శాఖ వ్య‌వ‌హారాల‌ను స‌మ‌గ్రంగా చూశారు.

ఈ నేప‌థ్యంలో అప్పుల విష‌యం ఆయ‌న‌కు బాగా తెలిసి ఉంటుంద‌ని నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బాధ్య‌త‌ను ఆయ‌న‌కే అప్ప‌గించ‌డం గ‌మ‌నార్హం. నిబంధనలు అన్ని ఉల్లంఘించి మాజీ సీఎం త‌న వారికి మాత్రమే బిల్లులు చెల్లించారని టీడీపీ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వాటిపై కూడా ఆర్థిక శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే జ‌గ‌న్ కు చెందిన సాక్షి ప‌త్రిక‌ను అధికారికంగా కొనుగోలు చేయ‌రాద‌ని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌కు, వ‌లంటీర్ల‌కు ప‌త్రిక నిలిచిపోయింది.

మొత్తం ఈ ప‌రిణామాలు చూస్తే.. వైసీపీ చేసిన త‌ప్పుల‌ను వెలుగు లోకి తీసుకురావ‌డంతోపాటు.. కొత్త ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసేందుకు కూడా.. కార్యాచ‌ర‌ణ సిద్ధ‌మైన‌ట్టు స‌మాచారం.