అయ్యోపాపం: ఆడుతూ.. పాడుతూ.. బుగ్గ‌య్యారు!

అప్ప‌టి వ‌ర‌కు ఆడుతూ.. పాడుతూ.. తిరిగిన ప‌సిపిల్ల‌లు.. వారిని చూస్తూ.. ఆనందంలో మునిగిన వారి త‌ల్లిదండ్రులు కూడా.. అగ్నికి ఆహుత‌య్యారు. క‌నీసం ఊహ‌కు కూడా అంద‌ని విధంగా జ‌రిగిన ఘోర అగ్నిప్ర‌మాదం 30 మంది వ‌ర‌కు.. చూస్తూ చూస్తూ ఉండ‌గానే కాలి బుగ్గ‌య్యారు. ఈ ఘ‌ట‌న గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్ ప్రాంతంలోని ప్ర‌ఖ్యాత మాల్‌లో చోటు చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు కేరింతలు కొట్టిన చిన్నారు బూడిద కుప్ప‌గా మారారు. వారిని చూస్తూ.. ఆనందంలో ఉన్న త‌ల్లిదండ్రులు కూడా విగ‌త జీవుల‌య్యారు. ఈ ఘోరం దేశం మొత్తాన్నీ క‌దిలించి వేసింది.

ఏం జ‌రిగింది?

గుజ‌రాత్‌లోని గేమ్ జోన్‌.. ఇక్క‌డ చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు ఆడుకునేందుకు, సేద దీరేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇది ప్రైవేటు కంపెనీ నిర్వ‌హిస్తున్న గేమ్ జోన్‌. వారాంతం కావ‌డంతో శ‌నివారం సాయంత్రం ఇక్క‌డ‌కు స్థానికుల‌తో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌మ చిన్నారుల‌తో క‌లిసి త‌ర‌లి వ‌చ్చారు. అంద‌రూ ఆనందంగా గ‌డుపుతున్న క్ష‌ణాల్లో ఒక్క‌సారిగా షార్ట్ స‌ర్క్యూట్ జ‌రిగి భ‌గ్గున మంట‌లు రాజుకున్నాయి. దీంతో అంద‌రూ ఉక్కిరి బిక్కిరికి గురై.. త‌ల్ల‌డిల్లిపోయారు. ఇంత‌లోనే మంట‌లు శ‌ర వేగంగా అలుముకోవ‌డం, బ‌య‌ట‌కు వ‌చ్చే మార్గం క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ మంట‌ల్లో చిక్కుకుని 27 మంది మృతి చెందారని అధికారులు చెబుతున్నారు. కానీ, ఈ సంఖ్య 30కిపైగా ఉంటుంద‌ని స్థానికులు తెలిపారు.

ప్ర‌ధాని దిగ్భ్రాంతి..

త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌లో జ‌రిగిన భారీ అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాలు ధైర్యంగా ఉండాల‌ని.. ప్ర‌భుత్వం అన్ని విధాలా సాయం అందిస్తుంద‌ని పేర్కొన్నారు. ఇక‌, ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ స్వ‌యంగా అగ్నిప్రమాదం జ‌రిగిన ప్రాంతాన్ని ప‌రిశీలించారు. రాజ్ కోట్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ప‌నిచేస్తున్న ఏపీ అధికారి రాజు భార్గ‌వ్ కూడా .. వెంట‌నే స్పందించి చ‌ర్య‌లు చేప‌ట్టారు. కాగా, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో ఇంత ఘోరం జ‌ర‌గ‌డం ఇది రెండో సారి అని అధికారి తెలిపారు.