కోర్టు మెట్లెక్కిన జూనియర్  !

ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో  681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే మహిళ నుండి కొనుగోలు చేశాడు. చట్టప్రకారం అన్ని అనుమతులను పొందిన తర్వాత ఏడాది క్రితం ఆ స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అయితే దీని మీద వివాదం ఉన్న విషయం ఆ తరువాత తెలిసింది. 

జూనియర్ ఎన్టీఆర్ కు ఆ స్థలం అమ్మడానికి ముందే 1996లో తమ వద్ద తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని ఎస్బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ బ్యాంకులు  ట్రిబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ బ్యాంకులకు అనుకూలంగా తీర్పును వెలువరిస్తూ, ఆ స్థలంపై బ్యాంకులకే హక్కులు ఉంటాయని వెల్లడించింది.

దీంతో తప్పనిసరి పరిస్థితులలో జూనియర్ ఎన్టీఆర్ తనకు స్థలాన్ని విక్రయించిన సుంకు గీతపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశాడు. దీంతో పాటు ట్రిబ్యునల్ తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై జస్టిస్ జే శ్రీనివాసరావు, జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం నిన్న విచారణ చేపట్టి జూన్ 6కు కేసు విచారణను వాయిదా వేస్తూ కేసుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను జూన్ 3లోగా అందజేయాలని ఆదేశాలు జారీచేసింది.