ఆన్‌లైన్ గేమ్‌లో ఓడించిందని, నడుం విరగ్గొట్టాడు

దేశమంతా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్ గేమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. అందులో ముఖ్యంగా లూడో గేమ్ ఆడేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మహిళలు ఈ ఆటకు ఎక్కువగా కనెక్ట్ కావడంతో ఈ నెల రోజుల్లో లూడో గేమ్ డౌన్‌లోడ్స్ మిలియన్లలో పెరిగాయి. అయితే భర్తతో కలిసి లూడో గేమ్ ఆడిన ఓ మహిళ, తన ప్రాణం మీదికి తెచ్చుకుంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదర నగరంలో వెలుగుచూసింది.

వడోదరలోని వెమలి ఏరియాలో భర్తతో కలిసి నివాసం ఉంటున్న 24 ఏళ్ల మహిళ, ట్యూషన్ టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. లాక్‌డౌన్‌లో భర్త బయటికి వెళ్లడం ఇష్టం లేని ఆమె, లూడో గేమ్ ఆడదామని అతన్ని ఒప్పించింది. అయితే భార్య చేతిలో వరుసగా నాలుగు, ఐదు గేమ్స్ ఓడిపోయాడు భర్త. ఆడదాని చేతిలో మళ్లీ మళ్లీ ఓడిపోతున్నానని టెంపర్ కోల్పోయి, తీవ్రమైన అసహనానికి గురైన అతను, భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు.

కోపం చల్లారిన తర్వాత బాధతో ఏడుస్తున్న భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ట్యూషన్ టీచర్‌ను పరీక్షించిన డాక్టర్లు… వెన్నెముకపై దాడి చేయడం వల్ల, ఆమె వెన్నుపూస‌ రెండు చోట్ల విరిగిందని తెలిపారు. చికిత్స తర్వాత భర్తతో కాపురానికి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె, పుట్టింటికి వెళ్తానని పోలీసులకు తెలిపింది. అయితే భర్త క్షమాపణలు చెప్పడంతో కాంప్రమైజ్ అయి, కేసు వెనక్కి తీసుకుని, కొన్నిరోజుల తర్వాత కాపురానికి వస్తానని చెప్పింది.

ఇకపోతే కాలక్షేపం ఇవ్వాల్సిన వీడియో గేమ్స్ కూడా జనాల్లో ఫ్రస్టేషన్‌ను పెంచుతున్నాయని ఈ సంఘటన రుజువు చేసింది. ఆదాయం లేక, అప్పులు ఎలా కట్టాలో తెలియక సతమతమవుతున్న కొందరు, అతిగా వీడియో గేమ్స్ ఆడడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని చెబుతున్నారు సైకాలజిస్టులు.