పదే పదే పుట్టింటికి వెళ్లటం భర్తను హింసించినట్లే: హైకోర్టు

ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్య చేసింది. విడాకుల కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న వేళ స్పందించిన ధర్మాసనం కీలక వ్యాఖ్య చేసింది. పదే పదే పుట్టింటికి వెళ్లటం కూడా భర్తను మానసికంగా హింసించటమేనని స్పష్టం చేసింది. భర్త పొరపాటు ఏమీ లేనప్పటికీ భార్య మాటిమాటికి పుట్టింటికి వెళ్లటాన్ని తప్పు పట్టింది.

భార్యభర్తల మధ్య పరస్పర ప్రేమ.. విశ్వాసం.. ఆరాధన భావన ఉంటే వైవాహిక బంధం అన్యోన్యతలతో వికసిస్తుందన్న న్యాయమూర్తి.. పుట్టింటికి భార్య పదే పదే వెళ్లటాన్ని తప్పు పట్టారు. ఒక విడాకుల కేసులో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక విడాకుల కేసును విచారించింది.

తమ పందొమ్మిదేళ్ల వైవాహిక జీవితంలో కనీసం తన భార్య తనను విడిచి పెట్టి ఏడుసార్లు పుట్టింటికి వెళ్లిపోయిందని.. అలా వెళ్లిన ప్రతిసారీ పది నెలల పాటు పుట్టింట్లోనే ఉండిపోయిందని సదరు భర్త పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భార్య నుంచి తనకు విడాకులు కావాలని భర్త కోరారు. అయితే.. ఈ కేసు తొలుత ఫ్యామిలీ కోర్టు ముందుకు వెళ్లగా.. భర్త కోరినట్లుగా విడాకులు మంజూరు చేయటానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు విచారించిన ధర్మాసనం.. సంయమనం కోల్పోయిన దంతుల మధ్య దూరం పెరుగుతూపోతే.. వారు ఎప్పటికి కలవలేనంతగా పరిస్థితి మారుతుందని చెప్పారు. భార్య హింస.. క్రూరత్వం కారణంగా విడివిడిగా ఉంటున్నదంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ధర్మాసనం విడాకుల్ని మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ తీర్పు ఆసక్తికరంగా మారింది.