భలే ట్విస్ట్.. ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్‌లు విశాఖలో

భారతీయులే కాక ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా చూసే టోర్నీ.. ఇండియన్ ప్రిమియర్ లీగ్. అంతర్జాతీయ టోర్నీలు, సిరీస్‌లను మించి ఈ వార్షిక లీగ్‌కు ఆదరణ ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ఆదరణ ఉన్న క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 17వ సీజన్‌తో ప్రేక్షకులను పలకరించబోతోంది.

ఏటా ఏప్రిల్ మొదటి వారంలో మొదలయ్యే టోర్నీ.. ఈసారి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మార్చి 22నే ఆరంభం కాబోతోంది. టోర్నీకి ఇంకో పది రోజులే సమయం ఉండగా.. తెలుగు క్రికెట్ ప్రేమికులకు ఒక శుభవార్త అందుతోంది. లీగ్‌లో అత్యంత ఆకర్షణీయ జట్టు, విరాట్ కోహ్లి ప్రాతినిధ్యం వహించే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు.. ఈసారి తన స్థానిక మ్యాచ్‌లను బెంగళూరులో కాకుండా వైజాగ్‌లో ఆడబోతోందట. ఈ రోజుకు ఇదే హాట్ న్యూస్.

గత ఏడాది దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. కర్ణాటకలో వర్షపాతం మరీ తక్కువ నమోదైంది. ఇంకా వేసవి ఆరంభం కాకముందే అక్కడ నీటి కటకటతో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో నీటికి తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్‌లను చిన్నస్వామి స్టేడియంలో సజావుగా నిర్వహించే పరిస్థితి లేదట. ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగితే స్టేడియానికి సరిపడా నీళ్లు అందించడం కష్టమేనట.

ఈ పరిణామం ఐపీఎల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి పూర్తిగా తరలించాల్సిన పరిస్థితి కల్పించింది. దీంతో ప్రత్యామ్నాయ వేదికలుగా విశాఖపట్నం, పుణెలను పరిశీలిస్తున్నారు. వైజాగ్‌యే అనువైన ప్రాంతం అని.. అక్కడే ఆర్సీబీ తన హోం మ్యాచ్‌లు అన్నీ ఆడుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే వైజాగ్ వాసులకు పండగన్నట్లే.