ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే.. రెండో మాటే లేదు..

“ఏపీ రాజధాని అమరావతే. దీనినే మేం అంగీక‌రిస్తున్నాం. ఇక్క‌డి రైతుల‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాం. మేం అన్ని విష‌యాల‌ను గ‌మ‌నిస్తున్నాం“  అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఏపీలో ప‌ర్య‌టించిన ఆయ‌న విజ‌య‌వాడ‌లో బీజేపీ నేత‌లు నిర్వ‌హించిన స‌మ‌య‌న్వ‌య స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన రాజ‌ధాని అంశంపై ఆయ‌న ప్ర‌ధానంగా మాట్లాడారు.

“ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాజ‌ధాని విషయంలో స్పష్టమైన సమాచారం ఇచ్చింది. బీజేపీ అమరావతినే ఏకైక రాజధానిగా పరిగణనలోకి తీసుకుంది“ అని రాజ్‌నాథ్ అన్నారు. ఈ విషయంలో ఎలాంటి చర్చకు అవ‌కాశం లేద‌న్నారు.  వచ్చే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజ్ నాథ్ దీమా వ్యక్తం చేశారు. తనకున్న 40 ఏళ్ల రాజకీయ అనుభంతో ఈ విషయం చెబుతున్నానని అన్నారు. ఆంధ్రాలో గతంలో కంటే తమకు ఓటు బ్యాంకు పెరిగిందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఇబ్బందులున్నా పోరాటాల ద్వారానే ప్రజల్లో నిలుస్తామని పేర్కొన్నారు. 

మాది సెక్యుల‌ర్ పార్టీ

అంతకుముందు రాజ్ నాథ్ సింగ్ విశాఖపట్నంలో క్లస్టర్ ప్రవాస్ యోజనలో భాగంగా జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం పథకాల వలన ఏపీలో బీజేపీకి ప్రజాదరణ బాగా పెరుగుతుందని చెప్పారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని నిఖార్సైన సెక్యులర్ పార్టీ అని అన్నారు. ఈ విషయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించిందని చెప్పారు. బీజేపీని చూసి ఓర్వలేని వారు.. బీజేపీని ఉత్తర భారత పార్టీ అని, మ‌త‌త‌త్వ పార్టీ అని ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాల బీజేపీ కోర్‌ కమిటీ స‌భ్యులు పాల్గొన్నారు. పార్టీ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పొత్తుల విష‌యాన్ని రాజ్‌నాథ్ ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.