ఇద్దరు అసాధారణ వ్యక్తులు ఐస్ క్రీం షాపులో సాదాసీదాగా!

బెంగళూరులోని జయనగర్ కార్నర్ హౌస్ ఐస్ క్రీం షాప్ కు సాదాసీదాగా వచ్చారు ఇద్దరు అసాధారణ ప్రముఖులు. వారెవరో కాదు. ఒకరు దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అయితే.. మరొకరు బ్రిటన్ దేశ ప్రధాని సతీమణి కం నారాయణమూర్తి గారాలపట్టి అక్షత మూర్తి. వారిద్దరు పలుకుబడిలోనూ.. పవర్ లోనూ.. డబ్బులోనూ అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న వారు. అయినప్పటికీ వారు ఎలాంటి హడావుడి లేకుండా ఐస్ క్రీం షాపునకు వచ్చి.. సాదాసీదా కస్టమర్ల మాదిరి కూర్చొని తింటున్నారు. సాధారణ వ్యక్తులుగా కనిపిస్తున్న వారిద్దరు అసాధారణ వ్యక్తులన్న విషయాన్నిఅక్కడున్న వారిలో ఒక్కరు తప్పించి మిగిలినవారెవరూ గుర్తించలేదు. వారి వెంట భద్రతా సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం.

అయితే వారిద్దరిని గుర్తించారు దేవి సింగ్ అనే వ్యక్తి మాత్రమే గుర్తించారు. ఆయన కూడా ఐస్ క్రీం తినటానికి అక్కడకు వచ్చి.. తాను చూసిన ఈ ఇద్దరు అసాధారణ ప్రముఖుల్ని చూసి షాక్ తిన్నాడు. వారిని గుర్తించిన ఆయన.. ఆ వెంటనే తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ తో ఫోటోలు తీయగా.. వారు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు సరికదా.. నవ్వుతూ చూస్తుండిపోయారు తండ్రీ కూతుళ్లు ఇద్దరు. తాను తీసిన ఫోటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

‘‘బ్రిటన్ లో అత్యంత ధనవంతులు.. శక్తివంతమైన ప్రధమ మహిళగా ఉండి కూడా చిన్నతనం నుంచి తనకు ఇష్టమైన ఐస్ క్రీం షాపునకు ఎంతో నిరాడంబరంగా వచ్చిన వైనాన్ని పేర్కొంటూ ఫోటోను పోస్టు చేశారు. తమ ఎన్జీవోతో కోట్లాది రూపాయిలు ఖర్చు చేసే నారాయణమూర్తి ఎంత సింఫుల్ గా ఒక ఐస్ క్రీం షాపుకు వచ్చిన వైనం సోషల్ మీడియాలో అందరిని తెగ ఆకర్షిస్తోంది.

ఇంతకూ అక్షతామూర్తి బెంగళూరు ఎప్పుడు వచ్చారన్న విషయానికి వస్తే.. నారాయణమూర్తి జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ కార్యక్రమం ఒకటి జరిగింది. ఆదివారం జరిగిన ఈ ప్రోగ్రాంకు ఆమె హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత చిన్నప్పుడు తానెంతో ఇష్టంగా తినే ఐస్ క్రీంను తండ్రితో కలిసి వచ్చి తిన్నారు. ఈ సందర్భంగా నెటిజన్ ఒకరు వారిద్దరి ఫోటో తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారింది. గొప్పోళ్లు ఎప్పుడు ఎంతో సింఫుల్ గా ఉంటారనే దానికి ఈ ఫోటో నిలువెత్తు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇంతటి అరుదైన వ్యక్తిత్వమే వారిని ఉన్నత శిఖరాలకు చేర్చిందని చెప్పాలి. ఈ ఫోటోను చూసి.. వారి సింపిల్ సిటీని పలువురు అభినందిస్తుంటే.. మరికొందరు మాత్రం వారానికి 70 గంటలుపని చేయాలన్న నారాయణమూర్తి వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ.. సాయంత్రం వేళ ఇలా ఐస్ క్రీంలు 70 గంటలు పని చేసే ఉద్యోగులకు సాధ్యమా? అంటూ విమర్శలు చేయటం గమనార్హం.