నా భర్తకు 500 మంది మహిళలతో సంబంధం’

మద్రాస్ హైకోర్టును ఒక మహిళ తాజాగా ఆశ్రయించింది. ఆమె చేసిన ఆరోపణ సంచలనంగా మారింది. తన భర్తకు 500 మంది మహిళలతో సంబంధం ఉన్నట్లుగా ఆమె ఆరోపించింది. కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలోకి వెళితే.. మద్రాస్ హైకోర్టుకు మధురైలో కూడా ధర్మాసనం ఉంది. ఇక్కడకు తంజావూరుకు చెందిన ఆర్తి అనే మహిళ ఒక పిటిషన్ దాఖలు చేసింది. తన భర్తకు భారీ ఎత్తున పలువురు మహిళలతో సంబంధాలు ఉన్నాయని పేర్కొంటూ చర్యల కోసం ఆమె కోర్టును కోరింది.

వివేక్ రాజ్ తో తనకు పెళ్లైందని.. తామిద్దరం కలిసి జీవిస్తున్నట్లుగా పేర్కొన్న సదరు వివాహిత.. తన భర్త సెల్ ఫోన్ చూసిన సమయంలో పలు అసభ్యకర వీడియోలు ఉన్నట్లుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని తన భర్తను.. అతడి తల్లిదండ్రులకు తాను చెప్పానని.. వారు ఈ విషయాన్ని ఎక్కడా చెప్పొద్దని తనను బెదిరించినట్లుగా పేర్కొన్నారు.

అంతేకాదు.. తాను రెండు నెలల గర్భంతో ఉన్నప్పుడు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తనకు అబార్షన్ అయ్యిందన్న ఆమె.. తనపై దాడి జరిగిన ఘటనను తంజావూరు ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సీబీసీఐడీ దర్యాప్తు చేపట్టేలా చూడాలని ఆమె మద్రాస్ మధురై హైకోర్టు బెంచ్ ను అభ్యర్థించారు. తమ ముందుకు వచ్చిన పిటిషన్ ను పరిశీలించిన న్యాయమూర్తి.. దీనికి జిల్లా ఎస్పీతో పాటు సీబీసీఐడీ వారు సమాధానాలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వైనం కలకలాన్ని రేపింది.