దేశంలో అదానీ హ‌వా.. ఆయ‌న తాజా రికార్డ్ ఇదే!

దేశంలో గ‌త ఐదేళ్లుగా ప్ర‌ముఖంగా వినిపిస్తున్న పేరు అదానీ. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌గా ఆయ‌న వెలు గొందుతున్నారు. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ద‌న్నుతో ఆయ‌న వ్యాపారాలు విస్త‌రించుకుంటున్నాయ‌నే విమ‌ర్శ‌లు కూడా ఉన్నాయి. అదానీ గురించి పార్ల‌మెంటు లో ప్ర‌శ్న‌లు సంధించిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఎంపీ మొహువా మొయిత్రాపై ఏకంగా వేటు కూడా ప‌డిన విష‌యం తెలిసిందే.

ఇంత వివాదాస్ప‌ద స‌మ‌యంలోనూ అదానీ హ‌వా దేశంలో కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ప్ర‌ముఖ ఆర్థిక కార్య‌క‌లాపాల విశ్లేష‌ణ సంస్థ‌ బ్లూమ్ బ‌ర్గ్ వెలువ‌రించిన నివేదిక‌లో దేశంలో అత్యంత సంప‌న్నడుగా గౌతం అదానీ ముందువ‌రుస‌లో నిల‌బ‌డ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న ఆస్తులు మ‌రింత పెరిగాయ‌ని.. ఆయ‌నకు సంబంధించి షేర్ మార్కెట్ తారా జువ్వ‌లా ఎగిసి పెరిగింద‌ని బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక స్పష్టం చేసింది.

తాజాగా బ్లూమ్ బ‌ర్గ్ మిలియ‌నీర్ సంస్థ వెలువ‌రించిన నివేదిక ప్ర‌కారం.. అదానీ సంప‌ద 97.6 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. ఇది దేశంలోనే అతి పెద్ద సంప‌ద అని పేర్కొంది. ముఖ్యంగా రెండు రోజుల కింద‌ట సుప్రీంకోర్టు అదానీ విష‌యంపై స్పందిస్తూ.. ఆయ‌న‌పై సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌ను ప్ర‌యోగించాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సెబీ విచార‌ణ చాల‌ని పేర్కొన్న ద‌రిమిలా అదానీ సంప‌ద పుంజుకున్న‌ట్టు ఈ సంస్థ పేర్కొంది.

ఇదే.. స‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో అతి పెద్ద సంప‌న్న‌డుగా ఉన్న జియో అధినేత ముఖేష్ అంబానీ.. ఇప్పుడు రెండో ప్లేస్‌కు చేరుకున్న‌ట్టు బ్లూమ్ బ‌ర్గ్ నివేదిక పేర్కొంది. ఆయ‌న సంప‌ద 97 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరిన‌ట్టు తెలిపింది. ఇక‌, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్నఅత్య‌ధిక సంప‌న్నుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉండ‌గా.. ఆయ‌న త‌ర్వాత అంబానీ 13వ ప్లేస్‌లో ఉన్నార‌ని ఈ నివేదిక స్ప‌ష్టం చేయ‌డం విశేషం.