డ్రగ్స్ నివారణకు యాక్షన్ ప్లాన్

తెలంగాణాలో ప్రత్యేకించి హైదరాబాద్ లో డ్రగ్స్ వాడకం బాగా పెరిగిపోతోంది. పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లలో యువతకు డ్రగ్స్ బాగా అందుబాబులోకి వచ్చేసింది. కాలేజీలు, కొన్ని స్కూళ్ళల్లో సైతం డ్రగ్స్ వాడుతున్నట్లు బాగా ప్రచారంలో ఉంది. దీనికి కారణం ఏమిటంటే డ్రగ్స్ నివారణలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవటమే. డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న వారు, వాడుతున్న వారిలో కొందరికి రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం.

కేసీయార్ ప్రభుత్వంలో డ్రగ్స్ బిజినెస్ తో పాటు వాడకం విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే బిజినెస్ చేస్తున్న వాళ్ళపైనా, వాడుతున్న వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ లేకపోవటమే కారణం. ఒకపుడు సినీ సెలబ్రిటీల్లో కొందరు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్నట్లు వాడుతున్నట్లు ఆధారాలతో సహా బయటపడిందన్నారు. దాదాపు 20 మంది ప్రముఖులను విచారణకు కూడా పిలిపించారు. తర్వాత వాళ్ళల్లో ఎవరిపైనా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఒకవైపు డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న ఆఫ్రికన్ దేశాల యువతపైన కూడా పెద్దగా యాక్షన్ లేదు.

కారణాలు ఏమిటంటే డ్రగ్స్ వాడుతున్న వాళ్ళల్లో రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్ళ పిల్లలు, పెద్దపెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ల పిల్లలతో పాటు సెలబ్రిటీల సంతానం ఉండటమే. బిజినెస్ చేస్తున్న వాళ్ళని పట్టుకుంటే వాడుతున్న వాళ్ళకి డ్రగ్స్ అందదు. అలాగని వాడుతున్న వాళ్ళని కూడా పట్టుకుంటే తమ పలుకుబడిని ఉపయోగించి బయటకు వచ్చేస్తున్నారు. తమ అవసరాల కోసమని బిజినెస్ చేస్తున్న వాళ్ళని కూడా ప్రముఖల పిల్లలు కాపాడుతున్నారనే ఆరోపణలున్నాయి.

వీళ్ళందరికీ డ్రగ్స్ దొరికేచోటు పబ్బులు, బార్లే. అయితే ప్రభుత్వం మారగానే డ్రగ్స్ వాడకం, బిజినెస్ పై ఉక్కుపాదం పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అందుకని బ్రీత్ ఎనలైజర్లు లాగ డ్రగ్ డిటెక్టింగ్ కిట్స్ ను సమకూర్చుకోవాలని పోలీసుశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. విద్యాసంస్ధల్లో యాంటి డ్రగ్ కమిటీలు, మెడికల్ షాపులపైన కూడా నిఘా పెట్టింది. ప్రతి పబ్బు, బార్ పైన నిఘా ఉంచటం, లోపల కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించటం ఇందులో ముఖ్యమైనవి. పబ్బు, బార్లలు టైమింగ్స్ ను కచ్చితంగా ఫాలో అయ్యేట్లు ప్లాన్ చేస్తున్నారు. మరీ యాక్షన్ ప్లాన్ ఎంతవరకు వర్కవటువుతుందో చూడాలి.