వేధిస్తున్నాడు.. సూసైడ్ కు అనుమతి ఇవ్వాలన్న మహిళా జడ్జి

సంచలన పరిణామం చోటు చేసుకుంది. పని ప్రదేశంలో మహిళలకు వేధింపుల సంగతి తెలిసిందే. సమాజంలో మిగిలిన రంగాలతో పోలిస్తే అత్యంత గౌరవ మర్యాదలకు పేరున్న జ్యూడిషియర్ వ్యవస్థ. అలాంటి ఆ వ్యవస్థలో కొందరు సీనియర్ జడ్జిలు తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఒక మహిళా జడ్జి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు బహిరంగ లేఖ రాయటం పెను సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మహిళా న్యాయమూర్తి తనకు ఎదురవుతున్న చేదు అనుభవాలపై లేఖ రాశారు. ఈ సందర్భంగా కొందరు సీనియర్ న్యాయమూర్తులపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. తక్షణమే దీనిపైనివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. యూపీలోని బాందా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఒక మహిళా జడ్జి తనకు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లుగా ఆరోపించారు. న్యాయ వృత్తి లో చేరిన తాను ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని పేర్కొన్నారు.

“సామాన్య ప్రజలకు న్యాయం చేద్దామని ఈ వృత్తిలో చేరాను. ఇప్పుడ నేనే న్యాయం కోసం ఆశ్రయించే పరిస్థితి. కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి.. ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగు కంటే హీనంగా చూస్తున్నారు. రాత్రిపూట జిల్లా న్యాయమూర్తిని ఒంటరిగా కలవాలంటున్నారు. దీని గురించి ఈ జులైలో అంతర్గత ఫిర్యాదుల కమిటీ ముందుకు తీసుకెళ్లా. ఎలాంటి ప్రయోజనం లేదు” అని వాపోయారు.

తన ఉదంతంలో సాక్ష్యులుగా ఉన్న వారంతా సదరు జిల్లా న్యాయమూర్తి కింద పని చేసేవారేనని.. అలాంటప్పుడు తన బాస్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే అవకాశం ఉంటుందని తాను ఎలా నమ్ముతానని పేరకొన్నారు.అందుకే తన ఆరోపణల మీద దర్యాప్తు పూర్తి అయ్యే వరకు సదరు జడ్జిని మరోచోటుకు బదిలీ చేయాలని ఆమె కోరుతు సుప్రీంకోర్టులో తాను పిటిషన్ వేస్తే.. సెకన్ల వ్యవధిలో కొట్టేశారన్నారు.

గడిచిన ఏడాదిన్నరగా జీవచ్ఛంలా బతుకుతున్నట్లుగా పేర్కొన్న ఆమె.. తాను బతికి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. “అందుకు గౌరవప్రదంగా చనిపోయేందుకు నాకు అనుమతి ఇవ్వండి” అని కోరారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చర్యలు చేపట్టారు. తక్షణమే తనకు దీనిపై నివేదిక కావాలన్న ఆయన.. సదరు మహిళా న్యాయమూర్తి కంప్లైంట్.. దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాల్ని సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్టార్ కు సమాచారం అందించారు. ఈ ఉదంతంఇప్పుడు పెను సంచలనంగా మారింది.