అమెరికాలో ఎన్ఆర్ఐ ఘరానా మోసం.. రూ.183 కోట్లు కొల్లగొట్టాడు

అగ్రరాజ్యం అమెరికాలో ప్రవాస భారతీయుడి ఘరానా మోసం బయటకు వచ్చింది. ఒక ఫుట్ బాల్ జట్టుకు చూసే అతగాడు.. ఏకంగా రూ.183 కోట్ల మేర కొల్లగొట్టిన వైనం షాకింగ్ గా మారింది. అతగాడి పాపం పండింది. అతగాడి వైనం హాట్ టాపిక్ గా మారింది. భారత సంతతికి చెందిన ఈ కేటుగాడు చేసిన పనికి నోరెళ్లబెడుతున్నారు. విలాసాలకు అలవాటు పడిన ఇతడు చేసిన ఈ నేరంపై ఇప్పుడు సీరియస్ చర్యలు తప్పవంటున్నారు.

అమెరికాలో నివసించే భారత సంతతికి చెందిన అమిత్ పటేల్.. ఆ దేశానికి చెందిన ఫుట్ బాల్ టీమ్ జాక్సన్ విల్లే జాగ్వార్స్ కు ఎగ్జిక్యూటిగా పని చేస్తుండేవాడు. జట్టు పనులు చూసే క్రమంలో.. అతడి మీద భరోసాతో అతనికి పనులన్ని అప్పజెప్పారు. దీన్నిఅవకాశంగా తీసుకున్న అతడు.. జట్టుకు సంబంధించిన 22 మిలియన్ అమెరికన్ డాలర్ల మొత్తాన్ని కొల్లగొట్టేశాడు. మన రూపాయిల్లో చూస్తే.. దగ్గర దగ్గర రూ.183 కోట్ల వరకు ఉంటుంది.

ఈ డబ్బుతో ఫ్లోరిడాలోని లగ్జరీ ఇంటిని కొనుగోలు చేయటంతో పాటు ఖరీదైన టెస్లా కారు.. విలువైన వాచ్ లతో పాటు.. క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. అంతేకాదు.. విలాసాలకు మరిగి.. స్నేహితులతో కలిసి చార్టెడ్ ఫ్లైట్లలో విహార యాత్రలు చేసేవాడు. ఇతగాడి తప్పుడు పనులు బయటకు వచ్చాయి.

దీంతో స్పందించిన జాక్సన్ విల్లే యాజమాన్యం అతన్ని ఉద్యోగం నుంచి ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలగించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసింది. ప్రస్తుతం విచారణలో ఉన్న ఈ కేసుపై తీర్పుత్వరలో వస్తుందని.. శిక్ష తప్పదని చెబుతున్నారు.