హోటల్ గది పంచాయితీతో రైనా వెళ్లిపోయాడా?

మిగిలిన క్రికెట్ టోర్నీలకు ఐపీఎల్ కు ఉన్న తేడా తెలిసిందే. ప్రతి సీజన్లో ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. కరోనా వేళ.. దుబాయ్ లో నిర్వహిస్తున్న ఐపీఎల్ రోటీన్ కు పూర్తిగా భిన్నమైనది. ఓవైపు వైరస్ భయం.. మరోవైపు సుదీర్ఘకాలం పాటు కుటుంబ సభ్యులకు దూరంగా మెలగటంతో పాటు.. మరిన్ని ఆంక్షల మధ్య ఆడాల్సిన బాధ్యత క్రికెటర్ల మీద ఉంది. ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ కు చెందినస్టార్ ఆటగాడు సురేశ్ రైనా టీం నుంచి అనూహ్యంగా తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది.

సన్నిహితుల మరణంతో పాటు.. కుటుంబంపై బెంగతోనే ఆయన వెళ్లిపోయినట్లుగా ఇప్పటివరకు వినిపించింది. అందుకు భిన్నంగా.. ఆయన తిరిగి వెళ్లిపోవటానికి కారణం.. అతగాడికి కేటాయించిన హోటల్ గదిగా చెబుతున్నారు. తనకు కేటాయించిన హోటల్ గది ఏ మాతం నచ్చలేదట. కనీసం బాల్కనీ కూడా లేని హోటల్ గది కేటాయిస్తారా? అని ప్రశ్నించటంతో పాటు.. ధోనీకి కేటాయించినట్లుగా గది తనకు కేటాయించాలని కోరాడట. కానీ.. జట్టు యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతోనే జట్టు నుంచి బయటకు వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు.

సాధారణంగా అయితే.. ఇవన్నీ పుకార్ల ఖాతాలోనే పడేవి. కానీ.. జట్టు యజమాని శ్రీనివాసన్ స్వయంగా ఈ అంశంపై మాట్లాడటంతో.. మరింత క్లారిటీ వచ్చిందని చెప్పాలి. పాతతరం సినిమా తారల మాదిరి క్రికెటర్లు తమ గురించి తాము గొప్పగా ఊహించుకుంటారన్నారు ‘చెన్నై జట్టులో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ కాదు. అందరూ సమానమే. అంతా కుటుంబంలా ఉంటారు. నిజంగా నీకు అసంతృప్తి ఉంటే వెళ్లిపోవచ్చు. నేను బలవంతం పెట్టను. కొన్నిసార్లు విజయాలు తలకెక్కటం మామూలే. మాకు ధోని రూపంలో బలమైన ఆటగాడు ఉన్నాడు’ అని ఆయన పేర్కొన్నారు.

అంతేకాదు.. ఐపీఎల్ నుంచి రైనా తొలిగిపోవటం ఆయనకే భారీ నష్టమని శ్రీనివాసన్ వ్యాఖ్యానించటం గమనార్హం భారీగా డబ్బు (సుమారు 11 కోట్లరూపాయిలకు పైనే) కోల్పోవటంతో పాటు.. మరిన్ని కోల్పోతాడు. ఇవన్నీ రానున్న రోజుల్లోరైనాకు బాగా అర్థమవుతాయంటూ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.