జుట్టూ..జుట్టూ ప‌ట్టుకున్న జంట‌, విమానాన్ని ఢిల్లీలో దింపేశారు!

భార్య భ‌ర్త అన్నాక‌.. చిన్న‌పాటి వివాదాలు.. మ‌న‌స్ప‌ర్థలు కామ‌న్‌. అయితే.. అవి కూడా ఇంటి వ‌ర‌కు ప‌రిమితం కావాలి. బ‌హిరంగ ప్ర‌దేశాలు, ప్ర‌యాణ స‌మ‌యాల్లో త‌గిన గౌర‌వంతో.. ప్ర‌క్క‌వారికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా మ‌సులుకోవాలి. అయితే.. ఈ చిన్న‌పాటి విచ‌క్ష‌ణ‌ను కోల్పోయిన ఓ జంట‌.. విమానంలోనే జుట్టూ జుట్టూ ప‌ట్టుకున్నారు. లెంప‌లు వాయించుకున్నారు. తోటి ప్ర‌యాణికుల‌కు తీవ్ర అభ్యంత‌రక‌రంగా కూడా వ్య‌వ‌హ‌రించారు. దీనికితోడు.. ఒక‌రిపై ఒక‌రు విమాన సిబ్బందికి ఫిర్యాదులు చేసుకున్నారు.

మా ఆవిడ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తోంద‌ని భ‌ర్త‌, కాదు.. అత‌నే న‌న్ను కొట్టాడ‌ని భార్య‌.. ఒక‌రిపై ఒక‌రు బూతుల‌తో విరుచుకు ప‌డ్డారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సిబ్బంది.. వెంట‌నే ఆకాశంలో ఉన్న విమానాన్ని తిరిగి వెన‌క్కి మ‌ళ్లించి.. ఢిల్లీకి చేర్చేశారు. చివ‌ర‌కు ఆ జంట‌ను విమానం నుంచి దింపేసి.. ఆ త‌ర్వాత‌.. ప్ర‌శాంతంగా గ‌మ్యానికి బ‌య‌లు దేరారు. ఇక‌, స‌ద‌రు జంట‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఆయా దేశాల అంబెసీ అధికారుల‌కు అప్ప‌గించ‌నున్నారు. వీరికి లుఫ్తాన్సా సంస్థ‌ భారీ ఎత్తున జ‌రిమానా విధించే అవ‌కాశం ఉంది.

ఎక్క‌డంటే..

స్విట్జర్లాండ్‌ నుంచి బ్యాంకాక్‌ బయలుదేరిన లుఫ్తాన్సా విమానంలో ఓ జంట(జ‌ర్మ‌నీకి చెందిన భ‌ర్త‌, ధాయ్‌లాండ్‌కు చెందిన భార్య ) ప్ర‌యాణించింది. వీరు ఆరేళ్ల కింద‌టే వివాహం చేసుకున్నారు. అయితే.. విమానం ప్రారంభం వ‌ర‌కు బాగానే ఉన్నారు. కానీ, మ‌ధ్య‌లో ఏమైందో ఏమో .. ఎయిర్‌లో ఉండ‌గా.. ఒక‌రితో ఒక‌రు క‌ల‌బ‌డ్డారు. జుట్టూ జుట్టు ప‌ట్టుకుని పీక్కున్నారు. దీంతో ప‌క్క‌నే ఉన్న తోటి ప్ర‌యాణికుల‌పై భార్య ప‌డింది. అత‌నిని ప‌ట్టుకుని లాగేసరికి ఆయ‌న కూడా ప‌డిపోయా డు.

మొదట తన భర్త ప్రవర్తన గురించి భార్య పైలట్‌కు ఫిర్యాదు చేసింది. భర్త తనను బెదిరిస్తున్నాడని, సిబ్బంది జోక్యం చేసుకోవాలని కోరింది. అనంత‌రం భ‌ర్త కూడా .. సేమ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ గొడవ గురించి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు వెల్లడించిన పైలట్లు.. మార్గ‌మ‌ధ్యంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. ల్యాండింగ్ అనంతరం వారిని విమానం నుంచి దింపేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే విమానం టేకాఫ్ అయింది.